
బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ లను ఈ గడ్డ నుంచి తరిమికొట్టాలని.. వాళ్ల అరాచకాలు, దుర్మార్గాలను అంతం చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2023, నవంబర్ 11వ తేదీ బెల్లంపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో గడ్డం వివేక్ వెంకటస్వామిలను భారీ మెజార్టీలతో గెలిపించాలని కోరారు. కాకా వెంకటస్వామి కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని.. నిరంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి అన్నారు రేవంత్ రెడ్డి.
వివేక్ వెంకటస్వామి వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు సంపాదించారని , బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం మంచిర్యాల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని చెప్పిన రేవంత్.. వివేక్, వినోద్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక్కడి కార్యకర్తలకు కాకా కుటుంబం అండగా ఉంటుందని.. కాకా కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
ఢిల్లీలో సొంత ఇంటిని AICC ఆఫీసుకు ఇచ్చిన కుటుంబం కాకాది అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు అన్ని ఇన్ని కావన్నారు. బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలను తరిమికొట్టి వారి దుర్మార్గాలు అంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొట్టే సమయం వచ్చిందన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సోనియాగాంధీతో తెలంగాణ ఇప్పించే ఘనత వెంకటస్వామిదేనన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం వివేక్ కృషి చేశారని చెప్పారు. సింగరేణి సంస్థ మూతపడకుండా చూసి వేలాది మంది కార్మికులను వెంకటస్వామి ఆదుకున్నారని తెలిపారు.