
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి దివంగత నేత గడ్డం వెంకటస్వామి(కాకా) పునాదులు వేశారని టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి అన్నారు. గురువారం కాకా జయంతి సందర్భంగా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లింగమూర్తి మాట్లాడుతూ.. కాకా ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.
ఇక్కడ బస్ డిపో ఉందంటే ఆయన చలవే అన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చిన ఘనత కాకాకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు, నాయకులు హసన్, మడప యాదవరెడ్డి, వెన్న రాజు, పోతుగంటి బాలయ్య, బూరుగు కిష్టస్వామి, బికే నాయక్, ఏదునూరి సుధాకర్,సతీశ్, రాధక్క, హరీశ్ పాల్గొన్నారు.