
బషీర్ బాగ్ వెలుగు : లక్డీకాపూల్లో శుక్రవారం ఉదయం 6 గంటలప్పుడు ఓ భారీ కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. స్వామి మూవర్స్కు చెందిన కంటైనర్ పేపర్ బండిల్స్తో మూసాపేట నుంచి కాటేదాన్ వెళ్తుండగా లక్డీకాపూల్ క్రాస్ రోడ్స్లో డివైడర్ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్స్తంభించింది. ఆ ఎఫెక్ట్ మెహిదీపట్నం, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సెక్రెటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అసెంబ్లీ రూట్లపై పడింది.
ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్తో ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ను తొలగించారు. ట్రాఫిక్ను క్లియర్చేశారు. లక్డీకాపూల్– మెహిదీపట్నం రూట్లో మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. గాయపడిన కంటైనర్ డ్రైవర్ మంగలేశ్యాదవ్ను పోలీసులు దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు.