
కూకట్పల్లి, వెలుగు: బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవర్యాక్షన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తనిఖీల్లో భాగంగా టూ వీలర్పై వస్తున్న యువకుడిని అంగి పట్టి గుంజడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయాడు. ఈ ఘటనను నిరసిస్తూ యువకుడి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్ఏర్పడింది. వారిని కంట్రోల్చేయడానికి ఒకదశలో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పోలీసులు, బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ పరిధిలోని రోడామిస్త్రీ నగర్లో ఉండే జోషిబాబు(35) కార్పెంటర్.
ఇతను పంజాగుట్టలో పని ఉండి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బైక్ పై బయలుదేరాడు. ఒంటిగంటకు ఐడీపీఎల్ టౌన్షిప్ మెయిన్గేటు వద్దకు చేరుకున్నాడు. అదే టైంలో అక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది జోషిబాబు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే, అతడు బైక్నడుపుతుండగా గోపాల్అనే ట్రాఫిక్కానిస్టేబుల్జోషిబాబును పక్కకు లాగే ప్రయత్నం చేయగా, జోషిబాబు మరో బైక్ని ఢీకొని రోడ్డు మీద పడ్డాడు. అదే టైంలో అటుగా వస్తున్న మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కిందపడగా తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
స్థానికులు, బంధువుల ఆందోళన
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జోషిబాబు చనిపోయాడంటూ స్థానికులు, యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ తాగి ఉన్నాడంటూ, వెంటనే యాక్షన్తీసుకోవాలంటూ అతడి వీడియోలు తీస్తూ పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి ట్రాఫిక్ పోలీసుల తప్పు ఉంటే శిక్షిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేయడంతో స్థానికులు, బంధువులు ఆందోళన విరమించారు. చివరకు ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్పై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.