
న్యూఢిల్లీ: కువైట్లో ఘోరం జరిగింది.. మన దేశ కార్మికులు ఉన్న బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కింది ఫ్లోర్ లో ఉన్న కిచెన్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఆరంతస్తుల భవనం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో బిల్డింగ్లో ఉన్న కార్మికుల్లో 49 మంది చనిపోయారు. ఇందులో పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయిన వాళ్లే ఎక్కువని అధికారులు చెప్పారు. మృతుల్లో 42 మంది కేరళ, తమిళనాడు, యూపీలకు చెందినవారేనని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఈ ప్రమాదం విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలంటూ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ను హుటాహుటిన కువైట్ పంపించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
కిచెన్లో ఎగిసి పడ్డ మంటలు
మంగాఫ్ సిటీలోని ఆరంతస్తుల భవనాన్ని కువైట్లోనే ప్రతిష్ఠాత్మక నిర్మాణ కంపెనీ ఎన్ బీటీసీ గ్రూప్ అద్దెకు తీసుకుంది. కార్మికుల నివాసం కోసం దీనిని వినియోగిస్తోంది. ఈ బిల్డింగ్లో మొత్తం 195 మంది కార్మికులను ఉంచింది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కిచెన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆరు గంటలకు తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే బయలుదేరి వచ్చే సరికి బిల్డింగ్నిండా పొగ కమ్మేసి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
కింది ఫ్లోర్లలో ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేసి, లోపల చిక్కుకున్నోళ్లను బయటకు తీసుకొచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో 165 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కార్మికులంతా నిద్రలో ఉండడం, బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో ఊపిరి ఆడక చాలా మంది మృత్యువాత పడ్డారని వివరించారు.
హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు
ఘటనాస్థలానికి కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా వెళ్లారు. స్థానిక అధికారులను అడిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న భారత కార్మికులను కలుసుకున్నారు. కువైట్ అగ్నిప్రమాదానికి సంబంధించి భారత ఎంబసీ అత్యవసర హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. కువైట్లోని తమ వారి అప్డేట్ల కోసం +965-65505246 నంబర్ ద్వారా కనెక్ట్ అవ్వాలని కోరింది.
బిల్డింగ్ యజమాని అరెస్టుకు ఆదేశాలు
అరబ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, రక్షణ మంత్రి షేక్ ఫహాద్ అల్-యూసుఫ్ అల్-సబా ఘటనపై స్పందించారు. అగ్నిప్రమాదం జరిగిన మంగాఫ్ బిల్డింగ్ యజమానిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే..క్రిమినల్ ఎవిడెన్స్ ఆఫీసర్ల దర్యాప్తు ముగిసే వరకు కార్మికుల కంపెనీ యజమాని బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కంపెనీ, బిల్డింగ్ యజమానుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు సజీవదహనం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే బిల్డింగులో వందల కొద్ది కార్మికులను ఉంచడం నింబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలాంటి బిల్డింగులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కువైట్ మునిసిపాలిటీ అండ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్కు ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని భద్రతా నియమాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. అంతేగాక.. అగ్నిమాపక ఘటనకు సంబంధించి కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్-దబ్బౌస్ తోపాటు పలువురు కీలక అధికారులను సస్పెండ్ చేశారు.
మోదీ ఆదేశంతో కువైట్కు కేంద్ర మంత్రి
పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ కువైట్కు పంపించారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం అందించడం, మృతదేహాలను ఇండియాకు పంపించే ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించా రు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో భారతీయులు చనిపోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశా రు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తంచేశారు. 50 మంది చనిపోగా, మరో 50 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందన్నారు. కువైట్లోని భారత రాయబారి ఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు.