- అతివేగంతో బస్సును ఢీకొట్టిన ఆటో
- కూతురికి బియ్యం తీసుకువస్తున్న తండ్రి మృత్యువాత
బోథ్, వెలుగు: అతివేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. వేగంగా వెళ్లిన ఓ ఆటో బస్సును ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం బోథ్ మండలంలో జరిగింది. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి(55) బోథ్ మండలం ధన్నూర్‘బి’ గ్రామంలో ఉండే తన కూతురు మార లావణ్య రెడ్డి కోసం తన పొలంలో పండించిన 5 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని తీసుకొని ఆటోలో వస్తున్నాడు.
మండలంలోని కుచులాపూర్ వెంకటేశ్వర ఆలయ సమీపంలో బోథ్నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ గంజేవార్ వసంత కృష్ణ తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నిర్మల్లోని ఓ ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు.10 నిమిషాలైతే తన తండ్రి ఇంటికి వచ్చేవాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కూతరు లావణ్య, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి అల్లుడు మార జైపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.ప్రవీణ్కుమార్ తెలిపారు.