తిరుమల.. ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో ఒకటి. ప్రతిరోజు కోట్ల రూపాయల్లో ఆదాయం. సంవత్సరానికి ఇక చెప్పనక్కరలేదు. అలాంటి శ్రీవారి సంపదలను ఇద్దరే ఇద్దరు కాపాడుతున్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. .. ఈ ఆలయం ఇప్పటిది కాదు.. .శ్రీవారి ఆలయాన్ని 5 వేల సంవత్సరాల క్రితం నిర్మించారని.. అప్పటి నుంచి ఆలయాన్ని.. ఆలయ సంపదను ఇద్దరు కాపాడుతున్నారని ఆధ్మాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అప్పుడెప్పుడో కాపాడి వదిలేయడం కాదు.. ఇప్పటికీ.. ఎప్పటికీ వారే కాపాడుతున్నారు... ఇక ముందు కాపాడతారట.. ఇంతకూ వారెవరనుకుంటుంటున్నారా...అయితే ఈ స్టోరీ చదవండి....
మన దగ్గర లక్ష రూపాయిలు ఉంటే వాటిని ఎక్కడ దాచాలా... ఎవరి దగ్గర ఉంచాలా.. మళ్లీ మనకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటాయా.. అని తెగ ఆలోచిస్తూ బుర్రలు చింపేసుకుంటాం. కాని తిరుమల ఆలయానికి రోజుకు కోట్ల రూపాయిల ఆదాయం వస్తుంది. అయితే ఆ ఆదాయాన్ని.. సంపదను ఓ ఇద్దరు కాపాడుతారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.. .
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతిరోజు 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అంటే నెలకు 75 నుంచి 90 కోట్లు, సంవత్సరానికి వెయ్యికోట్లకుపై మాటే. ఇంతటి ఆస్తిని కాపాడడమంటే అది చిన్న విషయం కాదు. ...అది కూడా వేల సంవత్సరాల నుంచి ఇద్దరే భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారట. వారు మహాద్వారం ఎదురుగా ఉన్న శంఖనిధి - ..పద్మనిధిలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి..
ఇంతకూ వారు ఎక్కడ ఉన్నారు..
తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు మనం మనకాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించకుండా స్వామి దర్శనానికి వెళతాము.
మహాద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల వలె సుమారు రెండు అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరే శ్రీవేంకటేశ్వరస్వామివారి సంపదలను రక్షించే దేవతలట... ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత, రెండు చేతుల్లోను రెండు శంఖాలు ఉంటాయి . ఈయన పేరు శంఖనిధి.. అలాగే కుడివైపున అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. ఆయన పేరు పద్మనిధి. ఈ నిధి దేవతల పాదాల వద్ద ఆరంగుళాల పరిమాణం గల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించండి.. ఈ విగ్రహం విజయ నగర రాజైన అచ్చుత దేవరాయలది. బహుశా అచ్చుతరాయల ఈనిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ట వల్ల తెలుస్తోంది. ఆలయం మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణ, రెండవది విమాన ప్రదక్షిణం, మూడవది సంపంగి ప్రదక్షిణం. అందుకే పురాతన కాలంలో స్వామివారి ఆలయానికి వెళ్లేముందు శంఖనిధి - .. పద్మనిధిలకు నమస్కారం చేసి భక్తులు లోపలికి వెళ్లేవారట. అంతటి ప్రాముఖ్యత కలిగిన వారు వీరిద్దరు. ఇప్పటికీ శ్రీనివాసుని సంపదలను కాపాడుతూనే వస్తున్నారని ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు.