జహీరాబాద్​లో ట్రయాంగిల్ ఫైట్

జహీరాబాద్​లో ట్రయాంగిల్ ఫైట్
  • బీజేపీ క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్
  • కాంగ్రెస్  నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్
  • బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్

సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో మూడు ప్రధాన పార్టీల్లో ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీపడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు విస్తరించి ఉన్నాయి. మూడు పార్టీల క్యాండిడేట్స్​గెలుపు తమదేనన్న ధీమాతో సెకండ్ క్యాడర్ లీడర్లను కలుస్తూ మద్దతు కోరుతూ వ్యూహాత్మక రాజకీయాలపై దృష్టి పెట్టారు. 

బీజేపీలో.. 

బీజేపీ క్యాండిడేట్​గా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పాటిల్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. మొదట్లో అసమ్మతి రాగం వినిపించిన జహీరాబాద్ బీజేపీ శ్రేణులు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగిన బీబీ పాటిల్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే బీజేపీలో చేరి ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడ్డారనే ప్రచారం జరుగుతోంది.

సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాటిల్ కు వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఓటింగ్ కు వచ్చేసరికి బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూల పవనాలు ఉంటాయని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఈ ఈక్వేషన్లలో బీబీ పాటిల్ పావులు కదుపుతూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. 

బీఆర్ఎస్ కొత్త పరిచయం

బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తారని అందరూ ఆశించారు కానీ ఆయన బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. మెదక్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్ కు పార్టీ హై కమాండ్ జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. మొదట్లో అనిల్ వ్యతిరేకించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలిసింది.

ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానన్న విశ్వాసంతో అనిల్ పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మార్పుతో పాటు ప్రజల్లో ఆయనకు ఉన్న వ్యతిరేకతను అనిల్ కుమార్ క్యాచ్​చేసుకుని ఓటు బ్యాంకును పెంచుకునేందుకు రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు అనిల్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో మొదటి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఈ లోక్ సభలోని అసెంబ్లీల వారీగా బలాబలాలు చూస్తే ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో కాంగ్రెస్ హవా చాటింది. జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, కామారెడ్డి ఒకచోట బీజేపీ గెలిచింది. ఈ పార్లమెంట్ పరిధిలో పార్టీల వారీగా వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కు

5,49,143 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ కు 5,30,499, బీజేపీకి 1,72,66 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీబీ పాటిల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై కేవలం 6 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ హయంలోనే పుంజుకున్నా కాంగ్రెస్ తాజాగా మరింత ఓటు బ్యాంకు సాధించి గెలుస్తుందని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.