
సూర్యాపేట, వెలుగు: సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆదర్శమూర్తి అని, బంజారా జాతిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన యోధుడని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.వెంకటేశ్చౌహన్ కొనియాడారు. గిరిజన శక్తి సూర్యాపేట జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహరాజ్ 286వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చౌరస్తా నుంచి భారీ ర్యాలీ చేపట్టారు.
బంజారా సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని, బంజారా భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు ధరావత్ వెంకటేశ్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు ధరావత్ సూర్యం నాయక్, దక్షిణ మధ్య రైల్వే డైరెక్టర్ పృథ్వీరాజ్ చౌహాన్, ఎంఈవో వెంకన్న నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ గుగులోతు రాజు నాయక్, సలహాదారుడు డా.రాజారాం, మూసీ ప్రాజెక్ట్ ఏఈఈ స్వప్న నాయక్, నాయకులు పాల్గొన్నారు.