మేము సైతం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్

మేము సైతం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలతో  రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. వరుణిడి ఉగ్రరూపానికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరద బీభత్సానికి రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వేల మంది వరదల్లో సర్వస్వం కోల్పోయారు. ఈ క్రమంలో వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద మనసుతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించగా.. యంగ్  హీరో విశ్వక్ సేన్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు డొనేట్ చేశారు. 

Also read:-కేంద్రం సమన్లతో దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్

ఇదిలా ఉండగానే తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.50 లక్షల ఆర్థిక సహయం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతుండటంతో తమ వంతుగా సహయం చేస్తున్నామని తెలిపారు. ‘‘భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలిచవేశాయి. ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు త్వరగా కోలు కోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము’ అని ప్రకటనలో పేర్కొన్నారు.  

Also Read:-తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ విరాళం