
రాష్ట్రాన్ని టీఆర్ఎస్ లీడర్లు దోచుకుంటున్నరు: వివేక్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. గూండారాజ్ పాలన సాగుతోందని, టీఆర్ఎస్ లీడర్లు భూ కబ్జాలు, ఇసుక మాఫియాకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లాయర్ దంపతులు తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నా సర్కార్ కనికరించలేదని.. టీఆర్ఎస్ అండతోనే వారిని కొందరు నడిరోడ్డుపై హత్య చేశారని అన్నారు. కొత్తగూడెంలో బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోడీ తీసుకెళ్తుంటే.. రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని అన్నారు.
మోసం చేయడంలో కేసీఆర్ నంబర్ వన్
ప్రజలను మోసం చేయటంలో కేసీఆర్నంబర్ వన్ స్థానంలోఉన్నారని వివేక్ విమర్శించారు. అబద్ధాలతో, అమలు కాని హామీలతో ఎన్నికల్లో గెలుపొందటం కేసీఆర్కే చెల్లిందని దుయ్యబట్టారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి జాడలేదు. రైతులను సన్నవడ్లు వేసుకోవాలని చెప్పి వారిని నష్టాల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. యువతకు నిరుద్యోగ భృతి, జాబ్స్ ఇవ్వలేని కేసీఆర్ తన కుటుంబంలోని వారందరికీ ఉద్యోగాలిచ్చుకున్నారు. టీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు లేరు” అన్నారు. సీతారామ ప్రాజెక్ట్తో చుక్క నీళ్లు అందలేదని, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో గొర్రెల పంపిణీతో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ‘‘ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్కు పోడు భూములు గుర్తుకు వస్తాయి. జిల్లాలకు తానే వచ్చి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన హామీ చెత్తబుట్టలోకి పోయింది. ఫారెస్ట్ ఆఫీసర్లు పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడాన్ని ఆపాలి. మైనింగ్, గిరిజన వర్శిటీలు ఎన్నికల హామీలుగానే మిగిలాయి” అని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి టెంపుల్కు రూ. వంద కోట్లు ఇస్తానన్న కేసీఆర్ మాటలు గోదాట్లో కలిశాయని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో సీఐ, ఎస్ఐ పోస్టులకు రూ. లక్షలు చెల్లించుకోవాల్సి వస్తోందని, పోలీస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో అవినీతి రాజ్యం
సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సింగరేణిలో అక్రమాలు, సీఎండీ తీరుపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
వివేక్ను కలిసిన దివ్యాంగులు
తమ పట్ల టీఆర్ఎస్ సర్కారు వివక్ష చూపుతోందని వివేక్కు దివ్యాంగుల స్టేట్ జేఏసీ చైర్మన్ గుండపనేని సతీశ్ ఆధ్వర్యంలో దివ్యాంగులు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.