![వానలు రానీ.. కొట్టుకపోనీ..పార్టీపైనే ఫోకస్](https://static.v6velugu.com/uploads/2021/09/TRS-Party-Leaders-Focus-on-the-Huzurabad-by-election_IeDx9lRpzA.jpg)
- వరదపై రివ్యూ చేయకుండా.. జెండా పండుగపైనే సీఎం, మంత్రుల దృష్టి
- ఢిల్లీ టూర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న ప్రజాప్రతినిధులు
- హుజూరాబాద్ ఉపఎన్నికపై లీడర్ల కసరత్తు
- గ్రేటర్కు గోదారి నీళ్లు బంద్
హైదరాబాద్కు ఎల్లంపల్లి నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం దగ్గర మెట్రో వాటర్ స్కీం పంపుహౌస్ నీట మునిగింది. దీంతో హైదరాబాద్ తాగునీటితో పాటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు భగీరథ నీటి సరఫరా బంద్ అయింది. పంపుహౌస్ మునగడంతో నగరంలో దాదాపు 40 శాతం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇంత అత్యవసరమైన సమస్యపై దానిపై మంత్రులు కనీసం రివ్యూ చేయలేదు. అధికారులు తమకు తామే పనులు చేసుకుపోతున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని ఒకవైపు వరదల ముంచెత్తుతుంటే.. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టంతా ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవంపైనే ఉంది. వరదలపై అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయాల్సిన మంత్రులు ఢిల్లీ టూర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందరు మంత్రులు హుజూరాబాద్ బైపోల్ మంత్రాంగంలో తలమునకలై ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అలర్ట్ చేసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలు అలర్ట్ కాలేదు. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్, నిర్మల్ పట్టణాలను వరద ముంచెత్తింది. వికారాబాద్ జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయి నవ వధువు ప్రవళిక మృతిచెందారు. ఆమె బంధువులు ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత గానీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శకు వెళ్లలేదు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో ఒకరు, వికారాబాద్ జిల్లా లింగంపల్లి సమీపంలో మరొకరు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యువకుడు బుగ్గవాగు దాటుతూ గల్లంతయ్యాడు. సిద్దిపేట జిల్లాలోని కూడెళ్లి వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. యాదాద్రి జిల్లాలో యువతి వరదలో గల్లంతయ్యారు. వరంగల్ లో ఉప్పొంగుతున్న నాలాలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృత్యువాత పడ్డారు. పలు ప్రాంతాల్లో ఇంకా వరద ఉధృతంగానే ఉంది.
కేటీఆర్ నియోజకవర్గంలో...
మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనూ సహాయక చర్యలు సవ్యంగా సాగడం లేదు. గొర్రెలు మేపడానికి ఆదివారం వెళ్లిన చంద్రమౌళి అనే వ్యక్తి మానేరు నదిలో చిక్కుకున్నాడు. ఆయనను రక్షించడానికి వెళ్లిన ఐదుగురు సభ్యులతో కూడిన రెస్క్యూ టీం కూడా మానేరు ఉధృతి పెరగడంతో అక్కడే ఉండిపోయారు. రెస్క్యూ టీం చిక్కుకుపోయిన తర్వాత గానీ మంత్రి కేటీఆర్ స్పందించలేదు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి కరీంనగర్ నుంచి స్పీడ్ బోట్లను తెప్పించాలని ఆదేశించారు. 24 గంటలకు పైగా గొర్రెల కాపరి, గొర్రెల మంద వరదలో చిక్కుకుపోయినా రియాక్ట్ కాలేదు. ఒక్కసారిగా వరద ముంచెత్తుతోందని, మిడ్ మానేరు నుంచి నీటిని కిందికి వదులుతున్నామని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయలేదు.
వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినా..
జులైలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి పెను నష్టం వాటిల్లింది. అప్పుడు సీఎం కేసీఆర్ రివ్యూ చేసి ఆదేశించేంత వరకు మంత్రులెవరూ హైదరాబాద్ దాటి వెళ్లలేదు. ఇప్పుడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నా సీఎం సహా ఎవరూ పట్టించుకుంటలేరు. సీఎస్ తనకు తానుగా రివ్యూలు చేస్తూ అధికారులకు ఆదేశిలివ్వడం తప్ప ప్రభుత్వపరంగా ఆ ప్రయత్నాలేవి కనిపించలేదు. వరదల్లో చిక్కుకుని పది మంది ప్రాణాలు కోల్పోయినా.. ఇంకా వరదలు కంటిన్యూ అయ్యే చాన్స్ ఉందని హెచ్చరికలు ఉన్నా దీన్ని కనీసం పట్టించుకోలేదు. సీఎం సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా హుజూరాబాద్ బైపోల్, ఢిల్లీలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన, టీఆర్ఎస్ జెండా పండుగ, సభ్యత్వ నమోదు పనుల్లోనే నిమగ్నమయ్యారు. బుధవారం మధ్యాహ్నమే కేసీఆర్ ఢిల్లీ ప్రయాణమవుతుండటంతో తాము వీలైనంత త్వరగా ఢిల్లీకి చేరుకోవాలనే ఆతృత తప్ప వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేద్దామని ఆలోచించడం లేదు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నా, వరంగల్ లోని ఇండస్ట్రియల్ ఏరియా నీటి మునిగి నష్టం వాటిల్లినా దాన్ని అంచనా వేసే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. బాధితులకు భరోసా ఇచ్చేవారే కరువయ్యారు.