
న్యూఢిల్లీ: ఒకవైపు ఎడాపెడా ‘ప్రతీకార టారిఫ్’ లు వేస్తున్న ట్రంప్ సర్కార్, వెనెజులా నుంచి ఆయిల్, గ్యాస్ కొంటున్న దేశాలపై 25 శాతం సెకెండరీ టారిఫ్ కూడా వేస్తామని ప్రకటించారు. వచ్చే నెల 2 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని తెలిపారు. వెనెజులా కావాలనే క్రిమినల్స్, గ్యాంగ్లను యూఎస్లోకి పంపుతోందని ఆయన ఆరోపించారు. ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన ట్రెన్ డె అరగ్యూ మెంబర్లను కూడా అమెరికాకు పంపుతోందని అన్నారు. ‘ఏ దేశమైనా వెనెజులా నుంచి ఆయిల్ లేదా గ్యాస్ కొనుగోలు చేస్తే, యూఎస్తో ఆ దేశం చేసే ఎటువంటి వ్యాపారంపైనైనా 25 శాతం టారిఫ్ వేస్తాం. అమెరికా లిబరేషన్ డే ఏప్రిల్ 2 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
రిలయన్స్, ఐఓసీపై ప్రభావం..
వెనెజులా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ ఈ మధ్య కొనడం ప్రారంభించింది. 2023 చివరిలో వెనెజులాపై అప్పటి యూఎస్ ప్రభుత్వం ఆంక్షలను తగ్గించింది. ఆ తర్వాత ఈ దేశం నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను ఇండియన్ కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. ఐఓసీ కూడా వెనెజులా నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను మూడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా తిరిగి ప్రారంభించింది.