
- యెమెన్పై ఎయిర్స్ట్రైక్.. 31 మంది మృతి
న్యూయార్క్: ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూప్హౌతీపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. యెమెన్పై శనివారం ఎయిర్ స్ట్రైక్ చేసింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. ఇందులో ఇప్పటి వరకూ 31 మంది మృతి చెందగా.. 101 మంది గాయపడినట్టు హౌతీ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని హౌతీలు కూడా ధ్రువీకరించారు.
ఈ దాడుల్లో 18 మంది సామాన్య పౌరులు కూడా మృతిచెందారని తెలిపారు. శనివారం సాయంత్రం తమ భూభాగంలో, రాజధాని సనా, సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఉత్తర ప్రావిన్స్ సదాలో యూఎస్ ఎయిర్స్ట్రైక్ చేసిందని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఆ ప్రాంతాల్లో వైమానికి దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. కాగా, అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడి చేస్తే సహించబోమని యూఎస్ ‘సెంట్రల్ కమాండ్’ పేర్కొంది. ఇది ప్రారంభం మాత్రమేనని హెచ్చరించింది.
దీనిపై స్పందించిన హౌతీ.. అమెరికాకు దీటుగా సమాధానమిచ్చింది. ఎయిర్స్ట్రైక్తమను నిరుత్సాహపరచలేవని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీ మీడియా కార్యాలయ డిప్యూటీ హెడ్ నస్రుద్దీన్ అమేర్ అన్నారు. ఇక, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
హౌతీలు.. మీ సమయం ఆసన్నమైంది: ట్రంప్
యెమెన్లో హౌతీలు ఉన్న ఏరియాల్లో ఎయిర్ స్ట్రైక్స్చేయాలని తమ సైన్యానికి శనివారం ఆదేశాలు జారీ చేసినట్టు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. లేకుంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నడూ చూడనంత నరకాన్ని చూపిస్తాం’’ అని ట్రూత్ వేదికగా హెచ్చరించారు. ఇరాన్ మద్దతున్న హౌతీ మిలిటెంట్లు కీలకమైన సముద్ర కారిడార్లో షిప్పులపై దాడులను ఆపే దాకా భీకర దాడులు కొనసాగుతాయని చెప్పారు.