
- సుమారు రూ.25 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా
- లైట్నింగ్ అరెస్ట్లు ఉన్నా పిడుగు పడడంపై అనుమానాలు
మణుగూరు, వెలుగు : మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి పిడుగుపడి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన ఘటనపై టీఎస్ జెన్కో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో డైరెక్టర్ లక్ష్మయ్య, సీఈ రత్నాకర్ బీటీపీఎస్కు చేరుకొని సీఈ బిచ్చన్నతో కలిసి ఎంక్వైరీ చేపట్టారు. పిడుగుపాటుకు దగ్ధమైన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించిన ఆఫీసర్లు నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదటి యూనిట్లో ఉత్పత్తి అయిన 270 మెగావాట్ల విద్యుత్ ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు చేరుకొని, అక్కడి నుంచి స్విచ్యార్డ్కు వెళ్తుంది.
జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మొదటి యూనిట్ను పూర్తిగా షట్డౌన్ చేశారు. ప్రమాదం జరిగిన ఘటనపై డైరెక్టర్ లక్ష్మయ్య మాట్లాడుతూ శనివారం రాత్రి పిడుగు పడడం వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, పిడుగుపాటు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని చెప్పారు. పిడుగు పడి షార్ట్ సర్క్యూట్ కావడంతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయని అవి అయిల్కు అంటుకోవడంతో మరింత నష్టం జరిగిందన్నారు. ప్రాథమికంగా రూ. 25 కోట్ల నష్టం జరిగి ఉండవచ్చని, పూర్తి స్థాయిలో విచారణ చేసి
జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి నష్టాన్ని అంచనా వేయగలమని తెలిపారు. ఈ ప్రమాదం మూలంగా మొదటి యూనిట్ను పూర్తిగా షట్డౌన్ చేయాల్సి వచ్చిందని, పునరుద్ధరణకు సుమారు 45 రోజులు పట్టొచ్చని చెప్పారు. పవర్ ప్లాంట్పై పిడుగులు పడకుండా లైట్నింగ్ అరెస్ట్లు ఉన్నాయని, అయినా ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
లైట్నింగ్ అరెస్ట్ల పనితీరుపై అనుమానం
బీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడి భారీ ఆస్తి నష్టం సంభవించిన ఘటనపై కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, సబ్స్టేషన్లపై పిడుగులు పడకుండా లైట్నింగ్ అరెస్ట్లను ఏర్పాటు చేస్తారని, అవి సమర్థవంతంగా పనిచేస్తే ఆయా ప్రాంతాల్లో పిడుగు పడినా ఎలాంటి నష్టం వాటిల్లదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1,080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన బీటీపీఎస్లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడడం విస్మయానికి గురిచేసిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైట్నింగ్ అరెస్ట్లు పనిచేయకపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రమాదంపై డిప్యూటీ సీఎం రివ్యూ...
మధిర, వెలుగు : భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పిడుగుపాటు కారణంగా జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం రివ్యూ చేశారు. మధిర క్యాంప్ ఆఫీస్లో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. పిడుగుపాటు కారణంగా జరిగిన ప్రమాదం వల్ల కలిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంపై విచారణ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ టీం వస్తుందని చెప్పారు. నిపుణులు పరిశీలన అనంతరం నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయని ఆఫీసర్లు చెప్పారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఆఫీసర్లను భట్టి ఆదేశించారు. పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, బిచ్చన్నలకు సూచించారు.