డిగ్రీ ఉత్తీర్ణతతో గెజిటెడ్​ హోదాలో ఉద్యోగం

డిగ్రీ ఉత్తీర్ణతతో గెజిటెడ్​ హోదాలో ఉద్యోగం

డిగ్రీ ఉత్తీర్ణతతో గెజిటెడ్​ హోదాలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు టీఎస్‌‌పీఎస్సీ డివిజనల్‌‌ అకౌంట్స్‌‌ ఆఫీసర్‌‌ (డీఏవో) నోటిఫికేషన్‌‌ ఇటీవలే విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌‌ ద్వారా మొత్తం 53 పోస్టులకు రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ చేపట్టనున్నారు. రాత పరీక్షలో మెరిట్‌‌ ఆధారంగా కొలువులు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో డీఏఓ సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​, ప్రిపరేషన్‌‌ గైడెన్స్‌‌ తెలుసుకుందాం.. 

టీఎస్‌‌పీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్​లో డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ వర్క్స్‌‌ అకౌంట్స్‌‌ పరిధిలోని పోస్టులకు సెలెక్షన్​ ప్రాసెస్ ఉంటుంది. మల్టీ జోన్‌‌ విధానంలో పోస్ట్‌‌లను విభజించి మల్టీ జోన్‌‌1 పరిధిలో 28, మల్టీ జోన్‌‌2 పరిధిలో 25 మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బేసిక్​ శాలరీ రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.

మెరిట్​ ఆధారంగా పోస్టులు

డివిజనల్‌‌ అకౌంట్స్‌‌ ఆఫీసర్‌‌ పోస్ట్‌‌లను రాత పరీక్షలో మెరిట్‌‌ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రాత పరీక్షలో పొందాల్సిన కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. జనరల్‌‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం; బీసీ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

రెండు పేపర్లు.. 450 మార్కులు

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌‌1లో జనరల్‌‌ స్టడీస్‌‌ అండ్‌‌ జనరల్‌‌ ఎబిలిటీస్‌‌ 150 ప్రశ్నలు150 మార్కులకు; పేపర్‌‌ 2లో అర్థమెటిక్‌‌ అండ్‌‌ మెన్సురేషన్‌‌ 150 ప్రశ్నలు300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ముఖ్యంగా పేపర్​2 లోని అర్థమెటిక్​, రీజనింగ్, మెన్సురేషన్​పై పట్టుంటే డీఏవో కొలువు సులువుగా కొట్టొచ్చు. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షను ఓఎంఆర్‌‌ షీట్‌‌ విధానం లేదా కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ టెస్ట్‌‌ విధానంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేన్‌‌లో పేర్కొన్నారు. 

కరెంట్​ ఎఫైర్స్​పై ఫోకస్​ చేయాలి

మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం పలు విధానాలు అమలు చేస్తున్నారు. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. కోర్‌‌ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీకి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఆయా సబ్జెక్ట్‌‌లను కరెంట్​ ఎఫైర్స్​తో అనుసంధానం చేస్తూ ప్రాక్టీస్​ చేయాలి. సమకాలీన పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్‌‌ మధ్య సాగుతున్న యుద్ధం, చైనా–తైవాన్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌‌ వంటి దేశాల అంతర్జాతీయ విధానాలు; జీ8 సదస్సు, కామన్వెల్త్‌‌ క్రీడలు భారత క్రీడాకారుల ప్రతిభ, బ్రిటన్‌‌ ప్రధాని ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఎకానమీ, పాలిటీ సబ్జెక్టులను కరెంట్​ ఎఫైర్స్​తో అనుసంధానం చేస్తూ ప్రిపరేషన్​ కొనసాగిస్తే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. 

సక్సెస్​ సీక్రెట్​

పేపర్‌‌1గా పేర్కొన్న జనరల్‌‌ స్టడీస్‌‌ అండ్‌‌ జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌లో.. అభ్యర్థులు ప్రాంతీయం నుంచి అంతర్జాతీయ అంశాల వరకూ.. అన్నింటిపైనా నాలెడ్జ్​ ఉండాలి. తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. తెలంగాణ విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు..నిధులు..నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పథకాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారో తెలుసుకోవాలి. పర్యావరణానికి సంబంధించి తెలంగాణకు హరితహారం అమలుచేస్తున్నారు. 

కాన్సెప్ట్​ నేర్చుకోవాలి

పేపర్‌‌2(అర్థమెటిక్‌‌ అండ్‌‌ మెన్సురేషన్‌‌)లో అభ్యర్థులు కాన్సెప్ట్యువల్‌‌ ప్రిపరేషన్‌‌తోపాటు ప్రాక్టీస్‌‌కు ప్రాధాన్యమివ్వాలి.  అర్థమెటిక్‌‌కు సంబంధించి నంబర్‌‌ సిస్టమ్‌‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. రేషనల్‌‌ నెంబర్స్, రియల్‌‌ నంబర్స్, సర్డ్స్‌‌ అండ్‌‌ లాగారిథమ్స్‌‌పై అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.  రేషియోస్‌‌ అండ్‌‌ ప్రపోర్షన్స్‌‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. యావరేజెస్, ప్రాఫిట్‌‌ అండ్‌‌ లాస్, డిస్కౌంట్, సింపుల్‌‌కాంపౌండ్‌‌ ఇంట్రస్ట్, పార్ట్‌‌నర్‌‌షిప్, టైమ్‌‌ అండ్‌‌ డిస్టెన్స్, టైమ్‌‌ అండ్‌‌ వర్క్, క్లాక్, క్యాలెండర్‌‌ వంటి అంశాలను ప్రాక్టీస్‌‌ చేయాలి. అదే విధంగా బహుపదులు, శ్రేఢులు వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సమితులు, లీనియర్‌‌ ఈక్వేషన్స్‌‌ను ప్రాక్టీస్‌‌ చేయాలి. స్టాటిస్టిక్స్‌‌ అండ్‌‌ ప్రాబబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సగటు, మధ్యగతం, బహుళకాలకు సంబంధించి అన్ని సిద్ధాంతాలను, సూత్రాలను అధ్యయనం చేసి.. వాటికి సంబంధించి సమస్యలను ప్రాక్టీస్‌‌ చేయాలి. మెన్సురేషన్‌‌కు సంబంధించి కొలతలు,స్క్వేర్స్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటర్‌‌ అంశాలను ప్రాక్టీస్‌‌ చేయాలి. రేఖా గణిత అంశాలను కూడా ప్రాక్టీస్‌‌ చేయాలి.  ట్రిగ్నోమెట్రిక్‌‌ అప్లికేషన్స్‌‌ తదితర అంశాలపై సంపూర్ణ పట్టు సాధించాలి.

షార్ట్​ నోట్స్​తో విజయం 

డీఏఓ ఎగ్జామ్​ జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ  పరీక్షలో విజయానికి ప్రాక్టీస్‌‌ కీలకం. ముఖ్యంగా పూర్తిగా లెక్కలు, అంకగణిత అంశాలతో ఉండే పేపర్‌‌2లో మంచి మార్కులు సాధించాలంటే.. ప్రాక్టీస్‌‌ తప్పనిసరి అని అభ్యర్థులు గుర్తించాలి. పేపర్‌‌2లో ప్రతి టాపిక్‌‌ను చదువుతూ వాటికి సంబంధించిన సిద్ధాంతాలను, సూత్రాలను, అప్లికేషన్స్‌‌ను, నిర్వచనాలను అవగాహన చేసుకోవాలి. వాటిని షార్ట్‌‌ నోట్స్‌‌ రూపంలో రాసుకుంటే.. రివిజన్‌‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌‌ సాగిస్తే.. డీఏఓ పరీక్షలో మంచి మార్కులు సాధించి సక్సెస్​ అవ్వొచ్చు.

                                                                                                                                                                                                                                                                                                             : పృథ్వీ కుమార్​ చౌహాన్​
                                                                                                                                                                                                                                                                                                                పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​