- గత జాతరలో 3,845.. ఇప్పుడు 6 వేలు
- మహాలక్ష్మి స్కీమ్తో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం
- 35 లక్షల మందిని చేరవేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు
- ఈసారి టికెట్ రేట్లలో స్వల్ప పెరుగుదల
వరంగల్, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2022 జాతర సమయంలో కరోనా టెన్షన్తో 3,845 బస్సులు నడిపి సుమారు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఈసారి కరోనా లేకపోవడమే కాకుండా మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం ఉండడంతో కోటీ 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 35 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేయడమే లక్ష్యంగా 6 వేల బస్సులను నడపనున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ.సజ్జనార్ ప్రకటించారు.
బస్సులన్నీ..మేడారం జాతరకే
ప్రధాన జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో 9 రీజియన్ల పరిధిలోని బస్సులను ఇటే నడిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులను నడపనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2,650 బస్సులు నడుస్తుండగా..ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2200 బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
16 నుంచి క్యాంప్.. డ్యూటీల్లో 14 వేలమంది
జాతర ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాల్లో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి మేడారం ఆర్టీసీ బేస్ క్యాంపు వేదికగా ఉన్నాతాధికారులు మకాం వేసి మానిటరింగ్ చేయనున్నారు. 14 వేల మంది సిబ్బంది మేడారం డ్యూటీలు చేయనున్నారు. భక్తులు ఎక్కువగా ప్రయాణించే ఉమ్మడి వరంగల్ నుంచే దాదాపు 2 వేల బస్సులు నడపనున్నారు. గ్రేటర్ వరంగల్ సిటీలోని మూడు ప్రధాన పాయింట్లయిన వరంగల్ బస్టాండ్, హనుమకొండ(హయగ్రీవచారి గ్రౌండ్), కాజీపేట (రైల్వే స్టేడియం) నుంచి 1200 బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజియన్ ఆర్ఎం శ్రీలత తెలిపారు.