అలాంటి భక్తులు తిరుమలకు కాలి నడకన రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి

అలాంటి భక్తులు తిరుమలకు కాలి నడకన రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలిబాటన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక విజ్ఙప్తి చేసింది. ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్న టీటీడీ.. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు పలు సూచనలు చేసింది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని.. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉండటంతో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని సూచించింది. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చని తెలిపింది.

ALSO READ | తిరుపతిలోని హోటల్స్ కు బాంబు బెదిరింపులు : పాక్ ISI పేరుతో మెయిల్స్

తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని.. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని సూచించింది. దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని భక్తులతకు తెలిపింది. తిరుమలకు కాలినడకన వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని సహకరించవలసినదిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.