
- హోలీనాటికి తేల్చాలని హెచ్చరిక
నిజామాబాద్, వెలుగు : ‘మహారాష్ట్ర సాంగ్లీలో పసుపు క్వింటాల్కు రూ.13 వేలు ఇస్తుండ్రు.. అదే రేటు ఇక్కడెందుకివ్వరూ.. వ్యాపారులు సిండికేట్గా మారి మమ్మల్ని ముంచుతున్నారు..’ అంటూ పుసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నిజామాబాద్ మార్కెట్ గంజ్లో పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు క్వింటాల్కు రూ.9,500 ఇస్తే గిట్టుబాటు కాదన్నారు.
న్యూడెమాక్రసీ పార్టీ అనుబంధ రైతు కూలీ సంఘం స్టేట్ సెక్రటరీ వి.ప్రభాకర్ నాయకత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణను ప్రశ్నలతో నిలదీశారు. ఈ-నామ్ విధానంలో రేటు ఫిక్స్ చేయడం ఆపేసి ఓపెన్ రేటు ప్రకటించాలన్నారు.
ప్రతి క్వింటాల్ పసుపునకు ప్రభుత్వం రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలన్నారు. హోలీ పండుగ వరకు చూసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల రాస్తారోకో చేయగా అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ నేతృత్వంలో రైతులు, వ్యాపారుల మీటింగ్ ఏర్పాటు చేసి క్వింటాల్ కొమ్ము పసుపునకు రూ.9,500 ధర నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరికొందరు రైతులు ఆ ధరను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు.