
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో శుక్రవారం పసుపు రికార్డ్ స్థాయి ధర పలికింది. 1,825 క్వింటాళ్ల ఫింగర్ క్వాలిటీ పసుపు అమ్మకానికి రాగా.. క్వింటాల్కు రూ. 14,400 ధర వచ్చింది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటాల్ రూ. 14 వేలు పలుకుతుండగా.. నిజామాబాద్ మార్కెట్లో ఆ రేటును దాటేసింది. లోక్వాలిటీ ఫింగర్ పసుపు కనిష్ట ధర రూ. 9,500 పలుకగా, మోడల్ ధర రూ.13 వేలు పలికింది.
బల్బు రకం పసుపు క్వింటాల్ గరిష్ట రేట్ రూ.13 వేలు, కనిష్ట ధర రూ.8 వేలు పులకగా.. మోడల్ ధర రూ.11,500 లభించింది. 223 చూరకు గరిష్ట ధర రూ.12,511, కనిష్ట రూ.8 వేలు, మోడల్ రేట్ రూ.11 వేలు చెల్లించారు. ఇందూర్లో ఇప్పటివరకు సుమారు 6 లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోల్లు జరుగగా.. సీజన్ మరో నెల రోజుల పాటు కొనసాగనుంది. ఎండ తీవ్రత పెరిగినందున క్వాలిటీ పసుపు మార్కెట్కు వస్తుండడంతో ధర పెరగుతుందని తెలుస్తోంది.