జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో జాప్యం తగదు:TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో జాప్యం తగదు:TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

కామారెడ్డి:రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టిందన్నారు. వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలన్నారు. పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదన్నారు. 

ఆదివారం (ఏప్రిల్27) కామారెడ్డిలో TWJF జిల్లా తృతీయ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సోమయ్య మాట్లాడుతూ..గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందన్నారు. ఇళ్ళ స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై పాత్రికేయుల పోరాటం తప్పదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి జర్నలిస్టులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. 

ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, తాటికొండ కృష్ణ, కార్యదర్శి గండ్ర నవీన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

నూతన కార్యవర్గం ఎన్నిక

 జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  TWJF నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా  అధ్యక్షుడుగా  బి.ప్రవీణ్ గౌడ్, కార్యదర్శిగా కె.కరుణాకర్, ఉపాధ్యక్షులుగా జమాల్ పూర్ లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, బి.రాకేష్, సంయుక్త కార్యదర్శులుగా సుంకరి సంజీవ్, మామిండ్ల లింగం, కోశాధికారిగా పి.రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా చొప్పదండి స్వాతి, బల్వంత రావు, ధనావత్ రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.