సంచార గొర్రె కాపరులపై దాడి

 సంచార గొర్రె కాపరులపై దాడి
  • వదిలేయండని.. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు

చేవెళ్ల, వెలుగు: సంచార గొర్రెల కాపరులపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నారాయణపేట జిల్లాకు చెందిన గొల్ల చంద్రప్ప, మరో ముగ్గురు తమకు చెందిన 200పైగా గొర్రెలను తీసుకొని గురువారం చేవెళ్ల మండలం పామెన పరిధిలోకి వచ్చారు. ఓ రైతు పొలంలో గొర్రెలను మేపుతుండగా, గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, చేవెళ్లకు ప్రభాకర్ రెడ్డి వారిపై ఆకారణంగా కర్రలతో దాడి చేశారు. 

అయ్యా.. తాము రైతును అడిగే మేపుతున్నాం.. వెళ్లిపోతామని కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. గొర్రెలపైనా దాడి చేసి గాయపడిచారు. స్థానికులు గమనించి బాధితులను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక గొల్ల కురుమ సంఘం నేతలు చేవెళ్ల ఠాణాలో శుక్రవారం బాధితులతో ఫిర్యాదు చేయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.