
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు దగ్గర ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా..మరి కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థులు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా బస్సు కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్నారు. ఈ లోపు వేగంగా వచ్చిన బొలెరో వాహనం విద్యార్థులను ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు నర్సింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోన్న మక్తల్ కు చెందిన మనీషా, మహేశ్వరీగా గుర్తించారు పోలీసులు.
మరో వైపు విద్యార్థుల మృతిపట్ల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.