
- కామారెడ్డి జిల్లాలో ఒకరు, మంచిర్యాలలో మరొకరు
కామారెడ్డి, వెలుగు : ఇంటర్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రానికి చెందిన రెడ్డి పూజ (17) తండ్రి చనిపోగా, తల్లి తన పుట్టింట్లో ఉంటోంది. దీంతో పూజ తన నానమ్మ గంగవ్వ వద్ద ఉంటూ కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మంగళవారం రిజల్ట్ రాగా ఇంగ్లిష్ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. మంగళవారం గంగవ్వ మరో ఊరికి వెళ్లడంతో పూజ తన పెద్దమ్మ ఇంట్లో పడుకుంది. బుధవారం ఉదయం నిద్రలేచి తన ఇంటికి వెళ్లింది.
ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో ఆమె పెద్దమ్మ వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే ఒంటిపై కిరోసిన్ పోసుకొని చనిపోయి కనిపించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు.
లక్సెట్టిపేటలో...
లక్సెట్టిపేట, వెలుగు : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్కు చెందిన పందిరి అశ్విత (17) ఓ కాలేజీలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్కు హాజరుకాకపోవడంతో మంగళవారం విడుదలైన రిజల్ట్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్విత బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు.