వ్యాధి నిరోధక టీకాల పంపిణీకి యూ విన్​ పోర్టల్​

వ్యాధి నిరోధక టీకాల పంపిణీకి యూ విన్​ పోర్టల్​

దేశవ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్​ చేయడానికి యూ–విన్​ పోర్టల్​ యాప్​ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నది. పైలెట్​ ప్రాజెక్టులో భాగంగా 2‌‌‌‌‌‌‌‌024, జులై 9 వరకు 5.33 కోట్ల మంది గ్రహీతల వివరాలను యు–విన్​లో కేంద్ర ప్రభుత్వం పొందుపరచనున్నది. 

ప్రతి గర్భిణి, అయిదేండ్ల లోపు పిల్లలకు వేసే ప్రతి టీకా వివరాలు యూ విన్​ పోర్టల్​ ద్వారా డిజిటలైజ్​ చేస్తారు. దీంతో వాక్సినేషన్​ షెడ్యూల్​ ప్రకారం వ్యాక్సిన్​ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులకు ఈ పోర్టల్​ ద్వారా ముందుగానే సమాచారం అందుతుంది. బాధితులు వ్యాక్సిన్​ వేసుకునే సమయాన్ని మర్చిపోయినా సరే పోర్టల్​ ద్వారా అందించిన సమాచారంతో సరైన సమయంలో తీసుకోవచ్చు. 

డిజిటలైజేషన్​ ద్వారా దేశం లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయవచ్చు. వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత ఈ పోర్టల్​ ద్వారా సర్టిఫికెట్​ను కూడా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. టీకా వేయించుకునే సమయాన్ని కూడా షెడ్యూల్​ చేసుకోవచ్చు. 

క్యూఆర్​ కోడ్​ ఆధారంగా పనిచేసే ఈ పోర్టల్​లో ఈ–టీకా ధ్రువీకరణ పత్రాన్ని దేశ పౌరులు ఎవరైనా పొందవచ్చు. కొవిడ్​ వ్యాక్సినేషన్​ పోర్టల్​ కో–విన్​ మాదిరిగానే పనిచేసే ఈ పోర్టల్​ను పశ్చిమబెంగాల్​ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్​ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

రియల్​ టైమ్​లో పనిచేసే ఈ పోర్టల్​/ యూ విన్​ యాప్​ను అండ్రాయిడ్​ ఫోన్​లో డౌన్​లోడ్​ చేసుకుని బాధితులు కోరుకున్న టీకా కేంద్రాల్లో టీకాలు పొందడానికి పౌరులు స్వీయ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.