- దేశవ్యాప్తంగా వచ్చే పదేండ్లలో 120 కొత్త ప్రాంతాలను కలుపుతూ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసే విధంగా ఉడాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వచ్చే పదేండ్లలో 120 కొత్త ప్రాంతాలను కలుపుతూ.. 4 కోట్ల మందిని వారివారి గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. పాట్నా, బిహ్తాలలో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను విస్తరించనున్నట్లు తెలిపారు.
ఉడే దేశ్ కా ఆప్ నాగ్రిక్ (ఉడాన్) పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 88 ఎయిర్పోర్టులను అనుసంధానం చేస్తూ.. 619 మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 1.5 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు తమ ఆత్మీయులను మరింత వేగంగా కలుసుకునేందుకు ఈ స్కీమ్ దోహదపడిందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల పేర్కొన్నారు.
రాబోయే పదేండ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి ఈ పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. హెలిప్యాడ్స్, కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, ఈశాన్య ప్రాంతాల్లోని జిల్లాలకు కూడా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.