
తెలుగువాళ్లంతా ఈ ఉగాది పండుగ కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు. ఈఏడాది (2025) మార్చి 30న తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి.. ఇదే తెలుగు వారి తొలి పండుగ.. షడ్రుచుల (తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు, పులుపు) తో తయారు చేసే పచ్చడి ఉగాది స్పెషల్, ఒక్క పచ్చడితో పండుగ పూర్తవ్వదు కదా. అందుకే ఈ పండుగ రోజు సంప్రదాయాన్ని పాటిస్తూ.. కొత్తదనంతో వంటలు చేసి వడ్డిస్తే.. పిల్లలతో పాటు ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా, లొట్టలేసుకుంటూ తింటారు. మరి అలాంటి కొత్త వంటలను చేసేద్దామా...
మామిడి పులిహార తయారీకి కావలసినవి
- అన్నం: మూడు కప్పులు,
- పుల్లటి మామిడికాయ: ఒకటి
- శెనగపప్పు: ఒకటీ స్పూన్
- పల్లీలు :పావు కప్పు
- జీడిపప్పు పలుకులు :పది
- మినప్పప్పు :ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి: నాలుగు
- ఎండుమిర్చి :ఐదు
- కరివేపాకు: రెండు రెమ్మలు
- ఉప్పు :తగినంత
- నూనె: సరిపడా
- జీలకర్ర :అర టీస్పూన్
- ఆవాలు :అరటీస్పూన్
- పసుపు: పావు టీ స్పూన్
- ఇంగువ :కొద్దిగా
- నువ్వులు :రెండు టీ స్పూన్లు
- మెంతులు :అర టీ స్పూన్
- ధనియాలు :ఒక టీ స్పూన్
తయారీవిధానం: ఒక వెడల్పాటి పళ్లెంలో అన్నాన్ని అరబెట్టాలి. మరోవైపు మామిడికాయ చెక్కు తీసి సన్నగా తురిమి అన్నంలో కలపాలి. అలాగే పచ్చిమిర్చిని పొడవుగా చీల్చాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులను విడివిడిగా వేగించి పొడి కొట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, సువ్వుల పొడి వేసి పోపు పెట్టాలి. దాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోరని కొత్త సంవత్సరం మొదటి పండుగరోజు టేస్ట్ చేయాల్సిందే
డైఫ్రూట్స్ భక్ష్యాల తయారీకి కావాల్సినవి
- మైదాపిండి లేదా గోధుమపిండి :రెండు కప్పులు
- నెయ్యి :సరిపడా
- ఉప్పు :చిటికెడు
- జీడిపప్పు పొడి :అరకప్పు
- బాదంపప్పు పొడి: అరకప్పు
- అంజీర్ పేస్ట్: అరకప్పు
- ఎండుకొబ్బరి తురుము :అరకప్పు
- ఇలాచీ పొడి :పావు టీ స్పూన్
- బెల్లం తురుము :అరకప్పు
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా లేదా గోధుమపిండి. ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మరోగిన్నెలో పొడి, బాదంపప్పు పొడి, అంజీర్ పేస్ట్ ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలాగా చేయాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తాలి. వాటి మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం పెట్టి, మళ్లీ ఉండలుగా చేయాలి. వీటిని చేతితో లేదా చపాతీ కర్రతో వత్తాలి. పెనంపై వాటిని నూనె లేదా నెయ్యితో రెండువైపులా కాల్చాలి. ఈ డ్రైఫ్రూట్ భక్ష్యాలను నెయ్యితో నంజుకుంటే రుచిగా ఉంటాయి.
►ALSO READ | Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం
మామిడి-–కొబ్బరి పచ్చడి తయారీకి కావలసినవి
- మామిడికాయ: ఒకటి
- పచ్చి కొబ్బరి తరుగు :ఒక కప్పు
- మినప్పప్పు :ఒకటీస్పూన్
- ఎండుమిర్చి: పది
- ఆవాలు, మెంతులు, జీలకర్ర :అరటీ స్పూన్ చొప్పున
- నూనె :సరిపడా
- ఉప్పు: తగినంత
- పసుపు: చిటికెడు
- ఇంగువ: కొద్దిగా
- కరివేపాకు :రెండు రెమ్మలు
- వెల్లుల్లి రెబ్బలు :నాలుగు
తయారీ విధానం: మామిడికాయ చెక్కుతీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పాన్ లో మెంతులు, ఎండుమిర్చి, మినప్పప్పులను విడివిడిగా వేగించాలి. అవి చల్లారాక మిక్సీలో అన్నింటినీ కలిపి గ్రైండ్ చేయాలి. మిశ్రమం మెదిగాక పచ్చికొబ్బరి తరుగు, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి పోపు పెట్టాలి. అందులోనే వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు, ఇంగువ వేయాలి. అన్నీ వేగాక మిక్సీ పట్టిన పచ్చడిని వేసి దింపేయాలి. పండుగ రోజు వేడివేడి అన్నంలో ఈ పుల్లటి పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తుంది.
సగ్గుబియ్యం తోదద్దోజనం తయారీకి కావలసినవి
- సగ్గుబియ్యం :ఒక కప్పు
- పెరుగు :రెండు కప్పులు
- పాలు :పావు కప్పు
- పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్
- అల్లం తరుగు :అర టీ స్పూన్
- శెనగపప్పు :అర టేబుల్ స్పూన్
- మినప్పప్పు: అరటేబుల్ స్పూన్
- ఆవాలు పావు: టీ స్పూన్
- జీలకర్ర :అరటీస్పూన్
- కరివేపాకు :రెండు రెమ్మలు
- జీడిపప్పు: పది
- నూనె లేదా నెయ్యి: సరిపడా
- కొత్తిమీర తరుగు :అరటేబుల్ స్పూన్
- పుదీనా తరుగు :ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: తగినంత
తయారీ విధానం: నాలుగు గంటలపాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. మరోవైపు స్టవ్ పై పాన్ లో నూనె లేదా నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేయాలి. ఆపైన నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. అవి బాగా మగ్గాక దింపేయాలీ. మరోవైపు వెడల్పాటి గిన్నెలో పెరుగు, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేయాలి కావాలనుకుంటే బూందీ వేసుకోవచ్చు. అంతే, దద్ధోజనం రెడీ..
పూర్ణం బూరెలు తయారీకి కావలసినవి
- శెనగపప్పు :ఒక కప్పు
- బెల్లం తురుము: ఒక కప్పు
- ఇలాచీ పొడి :అర టీస్పూన్
- నెయ్యి: సరిపడా
- మినప్పప్పు :ఒక టేబుల్ స్పూన్
- బియ్యప్పిండి :రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు: చిటికెడు
- నూనె :సరిపడా
తయారీ విధానం: మినప్పప్పును రెండు గంటలు పాటు నానబెట్టి రుబ్బాలి. దాన్ని తడిపిన బియ్యప్పిండిలో వేసి, తగినంత ఉప్పు కలిపి గంట సేపు నానబెట్టాలి. మరోవైపు శెనగపప్పును ఉడికించాలి . నీళ్లు వడగట్టి ఆ పప్పులో బెల్లం తురుము వేసి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో వేగించి చల్లారాక చిన్నచిన్న ఉండలుగా చేయాలి. వీటిని పిండిలో ముంచి, మరుగుతున్న నూనెలో దోరగా వేగించాలి. చాలా ప్రాంతాలో పూర్ణం బూరెలను ఉగాది స్పెషల్ గా చేసుకుంటారు
►ALSO READ | Ugadi 2025: కాలం.. శక్తి: ఉగాది వెనుక పరమార్థం ఇదే..!