
- ఆ దేశంతో డీల్కు సిద్ధంగా ఉన్నం
- మాకు భద్రతా హామీలు ముఖ్యం
- జెలెన్స్కీ వీడియో సందేశం
కీవ్: అమెరికాతో సంబంధాలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి అమెరికా సాయం మరిచిపోలేనిదని, ఆ దేశానికి రుణపడి ఉంటామన్నారు. ఖనిజాల ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేసేందుకు రెడీ అని చెప్పారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా జెలెన్స్కీ వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘‘మేం అమెరికా ప్రాముఖ్యతను గుర్తించాం. ఆ దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకిప్పుడు యుద్ధం ముఖ్యం కాదు.. శాంతి కావాలి.. అందుకే వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమని మేం చెబుతున్నాం’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
యూరోప్ నుంచి పూర్తి మద్దతు
శాంతి స్థాపనపై తామంతా ఐక్యంగా ఉన్నామని జెలెన్స్కీ తెలిపారు. యూరోప్ నుంచి తమకు పూర్తి మద్దతు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం తమకు వాస్తవమైన భద్రతా హామీలు అవసరమని తెలిపారు. ఈ విషయంపై యూరోపియన్ యూనియన్తోపాటు, యూకే, టర్కీ సపోర్ట్గా నిలుస్తున్నాయని చెప్పారు. అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకుంటామని, సానుకూలమైన చర్చల కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా రాజీనామా చేయాలని సూచించిన యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహంపై జెలెన్స్కీ మండిపడ్డారు. లిండ్సే గ్రాహంకు తాను ఉక్రెయిన్ పౌరసత్వం ఇస్తానని, ఆ తర్వాత దేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో లిండ్సే సూచించాలని చురకలు అంటించారు.