భారత్ ప్రధాని నరేంద్ర తల్చుకుంటే రష్యా దాడులు ఆపగలరు :  ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్​స్కీ

భారత్ ప్రధాని నరేంద్ర తల్చుకుంటే రష్యా దాడులు ఆపగలరు :  ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్​స్కీ
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ

న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తల్చుకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్​స్కీ అన్నారు. ఆర్థికంగా, జనాభాపరంగా పెద్ద దేశానికి మోదీ ప్రధాని అని గుర్తుచేశారు. ఎంతో కెపాసిటీ ఉన్న ఇలాంటి దేశం ఊరికే మాటలు చెప్పదని, యుద్ధం ముగిస్తుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్​స్కీ మాట్లాడారు.

కొద్దిరోజులకింద జరిగిన బ్రిక్స్ సమావేశం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాలన్నీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్​కు అనుకూలంగా మాట్లాడేవారేనని కామెంట్ చేశారు. మోదీ మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రస్తావించారని, శాంతికోసం కృషి చేయాలని సూచించారని గుర్తుచేశారు. అయితే, ఎంతోమంది లీడర్లు యుద్ధం ముగింపు గురించి మాట్లాడటం సాధారణమైపోయిందన్నారు.

మాటలు చెప్తే యుద్ధం ఆగదు

నిజంగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఎన్నో చేయొచ్చని జెలెన్​స్కీ అన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా భారత్ లాంటి దేశాలు కలిసి యుద్ధాన్ని సులభంగా ఆపొచ్చన్నారు. ‘‘రష్యా ఆర్థికవ్యవస్థను అడ్డుకోవడం, ఇంధన వనరులను కట్టడి చేయడం, రష్యన్ పారిశ్రామిక సముదాయాలను నిరోధించడం వంటి పనులు చేసి ఆ దేశ యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. జీ 20 దేశాలు తల్చుకుంటే పుతిన్​ను ఈజీగా కట్టడి చేయొచ్చు. అంతేగానీ, ఆయనను మెప్పించే మాటలు చెప్పుడు సరిపోదు. మేం శాంతిని కోరుకుంటున్నాం అని చెప్పనవసరం లేదు. దానికి బదులు ఏదోఒక చర్య తీస్కోవడం బెటర్”అని జెలెన్​స్కీ అన్నారు.

మా పిల్లలనైనా తిరిగి రప్పించండి

వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలు రష్యా అధీనంలో ఉన్నారని, కనీసం ఆ పిల్లలను తిరిగి తీసుకువచ్చేందుకైనా కృషి చేయాలని జెలెన్​స్కీ అన్నారు. అందులో 1,000  మంది పిల్లలనైనా ప్రధాని మోదీ తమ దేశానికి తిరిగి తీసుకురావాలన్నారు.“మీరు పిల్లలను తీసుకొచ్చేందుకు సంకీర్ణంలో చేరొచ్చు. పుతిన్​కు ఫోన్ చేసి నిలదీయొచ్చు. పిల్లలను బలవంతంగా ఎలా ఆధీనంలో ఉంచుకుంటారని ప్రశ్నించొచ్చు”అని జెలెన్​స్కీ అన్నారు. మోదీ తప్పకుండా ఆ పని చేయగలరని, ఆయన నిజంగా గొప్ప ఇన్​ఫ్లుయెన్స్ కలిగి ఉన్నారని చెప్పారు. ఉక్రెయిన్​కు ఇంత మంది పిల్లలను తిరిగి రప్పిస్తా అని తనకు చెప్పగలిగే కెపాసిటీ మోదీకి ఉందన్నారు. ‘అలాంటి ప్రధాని కనీసం వెయ్యి మంది పిల్లలను తీసుకురానీ”అని జెలెన్​స్కీ అన్నారు. మోదీ మాదిరిగానే ఇంకొంతమంది లీడర్లు కలిసి ఎంతోమంది పిల్లలను తిరిగి ఉక్రెయిన్​కు తిరిగి తీసుకురాగలరని, ఇప్పుడదే పని చేయాల్సి ఉందని అన్నారు.