అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.2,474 కోట్లు.. షేరుకు రూ.77.50 చొప్పున డివిడెండ్.. అదానీ నుంచి పోటీ

అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.2,474 కోట్లు.. షేరుకు రూ.77.50 చొప్పున డివిడెండ్.. అదానీ నుంచి పోటీ

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ మార్చి క్వార్టర్​లో రూ.2,474.79 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్​) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2,258.58 కోట్ల  నికర లాభం వచ్చిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. గత  ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.23,063.32 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇది రూ.20,418.94 కోట్లుగా ఉంది.

ఈ క్వార్టర్లో, అల్ట్రాటెక్ అమ్మకాల పరిమాణం (కన్సాలిడేటెడ్​) 41.02 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అల్ట్రాటెక్ సంవత్సరానికి 135.83 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాలను సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికమని (చైనాను మినహాయించి) తెలిపింది. దక్షిణాదికి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్​ను, యూఏఈ చెందిన రస్ అల్ ఖైమా రాక్​డబ్ల్యూసీటీలను కొనుగోలు చేయడం వలన అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు పోల్చదగినవి కావు. వీటిలో 25/12/2024 నుంచి ఇండియా సిమెంట్స్  ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. 
 
2025 ఆర్థిక సంవత్సర లాభం రూ. 6,039.64 కోట్లు
2025 ఆర్థిక సంవత్సరంలో అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం రూ. 6,039.64 కోట్లు కాగా, మొత్తం ఆదాయం రూ. 76,699.30 కోట్లు. ఇది ఏడాది క్రితం రూ. 7,003.96 కోట్లు ఉంది.   2025 ఆర్థిక సంవత్సరం సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాది లెక్కన 42.60 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) పెంచింది.  పెరిగిన వడ్డీ,  తరుగుదల కారణంగా పన్ను తర్వాత లాభం రూ. 7,005 కోట్ల నుంచి రూ. 6,039 కోట్లకు తగ్గింది. కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ కార్యక్రమంలో భాగంగా, అల్ట్రాటెక్ 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అనేక ప్రదేశాలలో 17.40 ఎంటీపీఏ సామర్థ్యాన్ని ప్రారంభించింది.  ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని లక్నోలో  బల్క్ టెర్మినల్‌‌‌‌ను  ఏర్పాటు చేసింది. 

అదానీ నుంచి పోటీ
అదానీ గ్రూపు స్విస్ సంస్థ హోల్సిమ్ నుంచి 6.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 51వేల కోట్లు) నగదు ఆదాయంతో అంబుజా సిమెంట్‌‌‌‌ను కొనుగోలు చేసి సెప్టెంబర్ 2022లో సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. అదానీ సిమెంట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 140 ఎంటీపీఏ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇదిలా ఉంటే, సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో దాని బోర్డు 775 శాతం డివిడెండ్‌‌‌‌ను సిఫార్సు చేసిందని -- ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.77.50 మొత్తం రూ.2,283.75 కోట్లుగా నిర్ణయించిందని ప్రత్యేక ఫైలింగ్‌‌‌‌లో కంపెనీ తెలిపింది. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ షేర్లు సోమవారం బీఎస్ఈలో 1.05 శాతం తగ్గి రూ.12,108.25 వద్ద స్థిరపడ్డాయి.