- సెమీఫైనల్లో ఇంగ్లండ్పై ఘన విజయం
- రాణించిన స్పిన్నర్లు, కమలిని, త్రిష
- రేపు సౌతాఫ్రికాతో టైటిల్ ఫైట్
కౌలాలంపూర్ : విమెన్స్ అండర్19 టీ20 వరల్డ్ కప్లో ఇండియా అమ్మాయిల జట్టు తిరుగులేని ఆట చూపెడుతోంది. మెగా టోర్నీలో మరోసారి ఫైనల్ చేరి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. గత పర్యాయం ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన అమ్మాయిలు ఈసారి సెమీఫైనల్లోనే ఆ జట్టు పని పట్టారు. స్పిన్నర్లు పరుణిక సిసోడియా (3/21), వైష్ణవి శర్మ (3/23) మ్యాజిక్కు తోడు ఓపెనర్ జి. కమలిని (50 బాల్స్లో 8 ఫోర్లతో 56 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 113/8 స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్ డెవినా పెర్రిన్ (45), కెప్టెన్ ఎబి నొర్గ్రోవ్ (30) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఆయుషి శుక్లా (2/21) రెండు వికెట్లు తీసింది. అనంతరం కమలినికి తోడు తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష (29 బాల్స్లో 5 ఫోర్లతో 35) మెరుపులతో ఇండియా 15 ఓవర్లలోనే 117/1 స్కోరు చేసి గెలిచింది. సిసోడియాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి.
స్పిన్నర్ల ముప్పేట దాడి
టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్కు ఓపెనర్ పెర్రిన్ మంచి ఆరంభం ఇచ్చింది. స్టార్టింగ్ నుంచే భారీ షాట్లతో ఎదురుదాడి చేసింది. ఐదో ఓవర్లో పరుణిక మూడు బాల్స్ తేడాలో జెమీమా స్పెన్స్ (9), ట్రడీ జాన్సన్ (0)ను బౌల్డ్ చేసినా... కెప్టెన్ నొర్గ్రోవ్తో కలిసి పెర్రిన్ జోరు కొనసాగించింది. నొర్గ్రోవ్కూడా వరుస షాట్లు కొట్టడంతో ఇంగ్లిష్ టీమ్ ఓ దశలో 80/2తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, చివరి పది ఓవర్లలో ఇండియా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 12వ ఓవర్లో పెర్రిన్ను బౌల్డ్ చేసిన ఆయుషి కీలక బ్రేక్ ఇచ్చింది.
ఇక్కడి నుంచి స్పిన్నర్లను ఎదుర్కోలేక ఇంగ్లిష్ టీమ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ నొర్గ్రోవ్ను కూడా ఆయుషి బౌల్డ్ చేయగా.. కెటీ జోన్స్ (0) ఫెయిలైంది. ఇక, వైష్ణవి వేసిన 16వ ఓవర్లో చార్లెట్ స్టబ్స్ (4), ప్రిషా తనవాలా (2), లాంబర్ట్ (0) పెవిలియన్ చేరారు. చివర్లో అము సురేన్కుమార్ (14 నాటౌట్), టిల్లీ కోర్టీన్ (7 నాటౌట్) పోరాటంతో ఆ జట్టు అతి కష్టంగా 110 మార్కు దాటింది.
ఓపెనర్ల జోరు
చిన్న టార్గెట్ను ఇండియా ఈజీగా ఛేజ్ చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ గొంగడి త్రిష ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. లాంగాన్, లాంగాఫ్ మీదుగా వరుస ఫోర్లతో అలరించింది. తనవాలా వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, కోర్టీన్ బౌలింగ్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. ఇంకో ఎండ్లో కమలిని నిలకడగా ఆడటంతో పవర్ ప్లేలో ఇండియా 44/0 స్కోరుతో నిలిచింది.
కానీ, తొమ్మిదో ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ బ్రేట్ లైన్ను మిస్సయిన త్రిష బౌల్డ్ అవ్వడంతో తొలి వికెట్కు 60 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాతి ఓవర్లోనే క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న కమలిని.. ఇంగ్లండ్ కు మరో చాన్స్ ఇవ్వలేదు. సనికా చాల్కె (11 నాటౌట్) సపోర్ట్తో టార్గెట్ను కరిగించింది. బ్రెట్ వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆమె ఆఖరి బాల్కు మరో బౌండ్రీతో మ్యాచ్ను ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ : 20 ఓవర్లలో 113/8 (పెర్రిన్ 45, నొర్గ్రోవ్ 30, పరుణిక 3/21, వైష్ణవి 3/23)
ఇండియా : 15 ఓవర్లలో 117/1 (కమలిని 56 నాటౌట్, త్రిష 35).