
కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ సమీపంలో హై లెవల్ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఆర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ట్రాన్స్పోర్ట్, పోలీస్, పంచాయతీ రాజ్ అధికారులు సంయుక్తంగా ఈనెల 13న వార్ధ నది ఒడ్డున ఇటీవల ఇనుప ఆర్చిని ఏర్పాటుచేశారు. టోల్ గేట్ చార్జీలు, ఇతర ట్యాక్స్లకు గండి కొడుతూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
రేషన్ బియ్యం సైతం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వీటన్నింటినీ కంట్రోల్ చేసేలా.. పది ఫీట్ల ఎత్తుకు మించి వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు ఈ ఆర్చిని ఏర్పాటు చేయగా ధ్వంసం చేశారు. అక్రమ దందాకు పాల్పడేవారే ధ్వంసం చేశారా? లేక మరెవరైనా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.