
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) విధానం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో దీనిని తీసుకొచ్చారు. యూపీఎస్ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) ను పునరుద్ధరించాలని రిక్వెస్టులు రావడంతో యూపీఎస్ను తీసుకొచ్చారు. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ టైమ్లో జీతంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్గా పొందుతున్నారు. యూపీఎస్ ప్రకారం, ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10 శాతం పెన్షన్కోసం చెల్లించాలి. ఇందులో కరువు భత్యం (డీఏ) కలిసి ఉంటుంది.
ప్రభుత్వ వాటా 14 శాతం నుండి 18.5 శాతానికి పెరుగుతుంది. దీనితో పాటు ప్రత్యేక పూల్డ్ ఫండ్ కూడా ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి అదనంగా 8.5 శాతం కంట్రిబ్యూషన్ అందుతుంది. ఫలితంగా యూపీఎస్ విధానంలో గత 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ వస్తుంది. ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి పెన్షన్లో 60 శాతం లభిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీతో పాటు వన్టైం సెటిల్మెంట్ను కూడా పొందుతారు. కేంద్ర ప్రభుత్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు నెలకు కనీసం రూ. 10 వేల పెన్షన్ లభిస్తుంది.