ఎయిమ్స్ను సందర్శించిన కేంద్ర మంత్రి
యాదాద్రి, వెలుగు: మెడికల్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినంక మెడికల్కాలేజీల సంఖ్యను 368 నుంచి 646కు పెంచామని చెప్పారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లు 44 వేల నుంచి 97 వేలకు, పీజీ సీట్లు 31 వేల నుంచి 63 వేల పెరిగాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను మాండవీయ సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ‘‘ఇ-–సంజీవని’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశ వ్యాప్తంగా వెల్నెస్సెంటర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ మెడికల్ సేవలు అందరికీ అందేలా చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా డిజిటల్ టెక్నాలజీతో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని వారికీ నాణ్యమైన ట్రీట్ మెంట్ అందించడమే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ పని చేస్తోంది” అని చెప్పారు.
ఎయిమ్స్ లో ‘‘ఇ–సంజీవని’’తో పేషెంట్ల రికార్డుల డిజిటలైజేషన్, స్పెషలిస్టులతో వీడియో కన్సల్టింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. డాక్టర్లు బిజినెస్ మైండ్ తో ఉండొద్దని, పేదలకు సేవలు అందించాలని సూచించారు. స్టూడెంట్లు మెడిసిన్ పూర్తయ్యాక వెల్ నెస్ సెంటర్లలో పని చేయాలన్నారు.
మోడీని రమ్మని కోరా: కోమటిరెడ్డి
ఎయిమ్స్కు రావాలని ప్రధాని మోడీని కోరినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రధాని వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం మాండవీయతో కలిసి ఎయిమ్స్లో హెర్బల్ మొక్కలు నాటారు. కాగా, ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు
హాజరు కాలేదు.