
- రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వంలో కేవలం ఐదుగురు మంత్రులకు న్యాయం జరుగుతుందని, 15 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు పాస్ అవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమ పనులు కావట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మేధావి వర్గం ఇచ్చే తీర్పుపై దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పోకుండా, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరా రు.
గత బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు, రైతులు సమస్యలపై పోరాటం చేశామన్నారు. ఫామ్హౌజ్లో ఉన్న కేసీఆర్ను బజార్లోకి తెచ్చామన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై చాలా మందిపై 30 , 40 కేసులు ఉన్నాయని, దెబ్బలు తిన్నారన్నారు. కాంగ్రెస్ లీడర్లపై ఎలాంటి కేసులు లేవన్నారు. ప్రజలు మాత్రం ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, వీవీఎస్ఎన్ప్రభాకర్, మాజీ ఎంపీ బీబీపాటిల్ తదితరులు పాల్గొన్నారు.