
పెద్దపల్లి, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు తమ దమ్ము చూపాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ల సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ప్రాణాలను లెక్కచేయని దేశభక్తులు బీజేపీ కార్యకర్తలని కొనియాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే స్ఫూర్తితో పనిచేసి గ్రాడ్యుయేట్ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి మల్క కొమురయ్యను గెలిపించుకోవాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఒకవైపు బీసీ జనాభాను తగ్గిస్తూ చూపుతూ.. 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో 10శాతం ముస్లింలకు కేటాయించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణరెడ్డి, కాశిపేట లింగయ్య, దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మీటింగ్లో ఫ్లెక్సీ రగడ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బండి సంజయ్ మీటింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని ఆ పార్టీ నాయకుడు గోమాస శ్రీనివాస్ శుక్రవారం వేదిక వద్ద నాయకులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. గోమాస శ్రీనివాస్ గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.