
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ వర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేయడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు సోమవారం (మార్చి 17) వర్శిటీలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓయూలో ఆందోళనలపై నిషేధం విధించడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేయడం అప్రజాస్వామికమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులేనని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్య భారతదేశంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని.. దీనికితోడు కనీస విద్య, నివాస వసతులు కూడా కల్పించలేని ఉస్మానియా వర్సిటీ యాజమాన్యానికి తమ ఆందోళన తెలియజేయడం విద్యార్థుల హక్కు అని అన్నారు. కానీ, విద్యార్థులు కనీసం నిరసన తెలపకుండా పోలీసుల పహారాలో అణచివేయాలని చూస్తే.. తెలంగాణ సమాజం చేతులు ముడుచుకొని అంగీకరించదన్నారు.
ఇలాగే విద్యార్థుల హక్కులను అణిచివేయడానికి ప్రయత్నించిన కేసీఆర్ను ఫాంహౌజ్ కే పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు.. ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గద్దెదించడం తెలంగాణ విద్యార్థి, యువతకు పెద్ద విషయం కాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలు పక్కన పెట్టి విద్యార్థుల హక్కులను హరించేలా విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ వేధింపులను ఆపడంతోపాటు వారిపై పోలీసు నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంలో ఓయూ విద్యార్థులకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అన్నారు.