
- కరీంనగర్ జిల్లా విలాసాగర్ లో గ్రామస్తుల ఆచారం
జమ్మికుంట, వెలుగు: ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుండగా కీడు సోకిందని గ్రామస్తులంతా ఇండ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లి వంటావార్పు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో కొద్ది రోజుల కింద ఒకరు చనిపోయారు. అతని దశదిన కర్మ పూర్తికాకుండానే మరొకరు ఇలా వరుసగా దాదాపు 11 మంది చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో అయిందని భావించిన ప్రజలు వేద పండితులను కలిశారు.
వారి సూచన మేరకు గురువారం తెల్లవారుజామునే గ్రామస్తులంతా తమ ఇండ్లకు తాళాలు వేసి చిన్నా పెద్దా లేకుండా సామగ్రితో మానేరు పరివాహక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వంటావార్పు చేపట్టారు. దీంతో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది. ఇలా చేయడంతో మరణాలు ఆగుతాయని, గతంలోనూ ఇలాంటి ఫలితం కనిపించిందని పలువురు గ్రామస్తులు తెలిపారు.