
- అభివృద్ధికి 22 శాతం, విద్యకు 13% కేటాయింపులు
- సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2025–-26 ఏడాదికి రూ.8,08,736- కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా గురువారం రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఖన్నా మాట్లాడుతూ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఈసారి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అభివృద్ధి పనులకు 22 శాతం, విద్యకు 13 శాతం, వ్యవసాయం దాని అనుబంధ సర్వీసులకు 11 శాతం నిధులు కేటాయించామని ఆయన వెల్లడించారు. 2024–25 ఏడాది బడ్జెట్ రూ.7,36,437 కోట్లతో పోలిస్తే ఈసారి 9.8 శాతం ఎక్కువగా నిధులు కేటాయించామన్నారు. గత బడ్జెట్ లో కొత్త పథకాలకు రూ.24,863.57 కోట్లు కేటాయించగా.. ఈసారి బడ్జెట్ నిధులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని, సైబర్ సెక్యూరిటీలో టెక్నలాజికల్ రీసర్చ్ కోసం పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే, రాష్ట్ర అసెంబ్లీని ఆధునీకరిస్తామని, స్కూళ్లు, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్మార్ట్ క్లాసులు, ల్యాబరేటరీలను డెవలప్ చేస్తామని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలోని 58 మునిసిపల్ బాడీలను ఐడియల్ స్మార్ట్ మునిసిపల్ బాడీలుగా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం ప్రతి మునిసిపాలిటీకి రూ.2.50 కోట్ల చొప్పున కేటాయిస్తామని తెలిపారు. యూపీ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మాణ కార్మికుల కోసం లేబర్ బేసెస్ను నిర్మిస్తామని వివరించారు. నిరుడు అక్టోబర్ 2న ‘జీరో పావర్టీ అభియాన్’ ను ప్రారంభించామని, ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలను గుర్తిస్తున్నామని, వారి వార్షిక ఆదాయాన్ని కనీసం రూ.1,25,000కు పెంచుతామని పేర్కొన్నారు.