
- బెంగళూరుకు యూపీ చెక్
- రాణించిన ఎకిల్స్టోన్, శ్వేత, దీప్తి
- ఎలైస్ పెర్రీ మెరుపులు వృథా
బెంగళూరు: డబ్ల్యూపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యూపీ వారియర్స్ షాకిచ్చింది. టోర్నీ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో ఆర్సీబీకి చెక్ పెట్టి యూపీ వారియర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్లో యూపీ 8/1 స్కోరు చేయగా, ఆర్సీబీ 4/0 స్కోరుకే పరిమితమై ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. ఎలైస్ పెర్రీ (56 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 90 నాటౌట్) దంచికొట్టగా, డ్యానీ వ్యాట్ (57) హాఫ్ సెంచరీతో అండగా నిలిచింది.
23 రన్స్ వద్ద కెప్టెన్ స్మృతి మంధాన (6) ఔట్ కావడంతో కష్టాల్లో పడిన ఆర్సీబీని పెర్రీ, హోడ్జ్ రెండో వికెట్కు 94 రన్స్ జోడించి ఆదుకున్నారు. ఇద్దరు చెరో 36 బాల్స్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వ్యాట్ ఔటైన తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ను యూపీ కట్టడి చేసింది. రిచా ఘోష్ (8), కనిక (5), వారెహమ్ (7), గార్త్ (2) నిరాశపర్చినా పెర్రీ భారీ హిట్టింగ్తో చెలరేగింది. హెన్రీ, దీప్తి శర్మ, తహ్లియా తలో వికెట్ తీశారు. ఛేజింగ్లో యూపీ 20 ఓవర్లలో సరిగ్గా180 రన్స్కు ఆలౌటైంది.
సోఫీ ఎకిల్స్టోన్ (19 బాల్స్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 33), శ్వేత (31), దీప్తి శర్మ (25), కిరణ్ నవ్గిరె (24) కీలక భాగస్వామ్యాలు అందించారు. చివర్లో భారీ షాట్లతో విజృంభించిన ఎకిల్స్టోన్ ఆటను సూపర్ ఓవర్కు తీసుకెళ్లింది. స్నేహ్ రాణా 3, రేణుకా, గార్త్ చెరో రెండు వికెట్లు తీశారు. కీలక రన్స్ పాటు సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎకిల్స్టోన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ, గుజరాత్ జట్లు పోటీ పడతాయి.