ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి.. రూ. 10 లక్షలకు పైగా అప్పు చేసి..

ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి.. రూ. 10 లక్షలకు పైగా అప్పు చేసి..
  • ఆన్​లైన్​ బెట్టింగ్​కు మరో యువకుడు బలి
  • రూ. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు
  • తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్​
  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన
  • మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

గోదావరిఖని, వెలుగు: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో నష్టపోయి 27 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గోదావరిఖని టూ టౌన్​ సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేణి సాయితేజ (27) గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం రూ.10లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో  ఈ నెల 18న సాయంత్రం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన స్నేహితుడు రవితేజకు ఫోన్​ ద్వారా సూసైడ్​ చేసుకుంటున్నట్టు తెలిపాడు.

దీంతో రవితేజ అక్కడికి చేరుకుని సాయితేజను మొదట గోదావరిఖని, ఆ తర్వాత కరీంనగర్​లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. ట్రీట్​మెంట్​ తీసుకుంటూ సాయితేజ గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోస్ట్​మార్టం​ నిమిత్తం బంధువులు మృతదేహాన్ని మంథని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. అయితే ఇన్సిడెంట్​ తమ పరిధిలో జరగలేదని మంథని పోలీసులు తెలపడంతో.. గోదావరిఖని టూటౌన్​ పోలీసులు వెళ్లి పంచనామా నిర్వహించి, పోస్ట్​మార్టం చేయించారు. అనంతరం స్వగ్రామం విలోచవరంలో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.