
న్యూయార్క్: విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... వివిధ దేశాలకు చెందిన రాయబారులపైనా బహిష్కరణ వేటు చేస్తున్నారు. ఇటీవలే తుర్క్ మెనిస్థాన్ లో పాక్ రాయబారిగా ఉన్న ఎసాన్ కు యూఎస్ లోకి అనుమతి నిరాకరించి, వెనక్కి పంపిన అమెరికా... తాజాగా యూఎస్ లోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్ పై వేటు వేసింది. ఇబ్రహీం రసూల్ 2010 నుంచి 2015 వరకు అమెరికాలో దక్షిణాఫ్రికా రాయబారిగా పని చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆ పదవిని చేపట్టారు.
'దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్ ఈ దేశంలో ఉండేందుకు ఆహ్వానించదగిన వ్యక్తి కాదు. అధ్యక్షుడు ట్రంప్ ను ద్వేషించే వ్యక్తి. ఆయన ఒక జాతి విద్వేష రాజకీయ నాయకుడు. దీనిపై ఆయనతో చర్చించాల్సింది ఏమీ లేదు' అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. రసూల్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీని కారణంగానే ఆయన్ను బహిష్కరించినట్లు తెలుస్తోంది.