
- భారత ఎన్నికలకు యూఎస్ ఫండ్స్ పై ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్
న్యూఢిల్లీ: మన దేశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి రూ.182 కోట్ల అమెరికా సాయంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. ఇండియాలో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ పాలకవర్గం ప్రయత్నించిందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధన్ ఖడ్ స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియేషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
‘‘ మన దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అంటే ప్రజాస్వామ్యంపై జరిగిన ఘోరమైన దాడిగానే భావించాలి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇది చిన్న వ్యవహారం కాదు. సమస్య చిన్నగా ఉన్నపుడే దానిని పరిష్కరించాలి. మన దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు యత్నించిన వారెవరో గుర్తించాలి. వారిని ప్రపంచం ముందు బట్టబయలు చేయాలి” అని ఉపరాష్ట్రపతి అన్నారు.