
- వర్జీనియాలో దారుణం
వాషింగ్టన్: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. వర్జీనియాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇండియాకు చెందిన ఊర్మి (24), ఆమె తండ్రి ప్రదీప్పటేల్ (56) అకోమాక్కౌంటీలోని తమ బంధువుల డిపార్ట్మెంటల్స్టోర్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం షాప్ తీయగానే.. మద్యం కొనేందుకు స్టోర్కు దుండగుడు వచ్చాడు. ముందురోజు రాత్రి స్టోర్ను ఎందుకు మూసివేశారని వారిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు.
అనంతరం వారిపై కాల్పులు జరపగా.. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఊర్మి హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. నిందితుడిని జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44)గా గుర్తించిన పోలీసులు.. అతడిని కేసు నమోదు చేశారు.
న్యూ మెక్సికోలో ముగ్గురు..
న్యూ మెక్సికోలోని లాస్ క్రూసెస్లో కార్ షో సందర్భంగా రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్తా కాల్పులకు దారితీయడంతో ఓ మైనర్ తో పాటు ముగ్గురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.