![ట్రంప్ టారిఫ్ వార్.. స్టీల్, అల్యూమినియంపై 25 శాతం](https://static.v6velugu.com/uploads/2025/02/us-president-donald-trump-announced-an-additional-25-percent-tariff-on-steel-aluminum-imports_xzZIycPMTq.jpg)
- అన్ని దేశాలపైనా వేస్తామని ప్రకటన
- కెనడా, మెక్సికో, చైనా, సౌత్కొరియా, బ్రెజిల్పై ఎక్కువ ప్రభావం
- ఇండియా కంపెనీలపైనా ఎఫెక్ట్
- రెసిప్రొకల్టారిఫ్కూడా వేస్తామన్న యూఎస్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ వేస్తామని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియాతో సహా అన్ని దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ఈ టారిఫ్లు పడనున్నాయి. దీంతో పాటు తమపై ఎక్కువ టారిఫ్లు వేస్తున్న దేశాలపై అంతేస్థాయిలో టారిఫ్లు (రెసిప్రొకల్ టారిఫ్స్) విధిస్తామని కూడా పేర్కొన్నారు.
‘యూఎస్లోకి వచ్చే ఏ స్టీల్పైనైనా 25 శాతం టారిఫ్ పడుతుంది’ అని మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అల్యూమినియం పైన కూడా వేస్తామని చెప్పారు. ‘వాళ్లు (వివిధ దేశాలు)130 శాతం టారిఫ్ వేసినా, మన ఎటువంటి టారిఫ్లు వేయడం లేదు. ఇకపై నుంచి అలా ఉండదు’ అని అన్నారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే టారిఫ్ వార్కు ట్రంప్ తెరతీశారు.
మెక్సికో, కెనడా నుంచి చేసుకునే అన్ని దిగుమతులపై 25 శాతం టారిఫ్ వేస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని 30 రోజుల పాటు వాయిదా వేశారు. చైనాపై వేసిన 10 శాతం టారిఫ్ను మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీనికి స్పందనగా చైనా కూడా యూఎస్ ప్రొడక్ట్లపై 15 శాతం టారిఫ్ విధించింది. వలసలను కంట్రోల్ చేసేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా ట్రంప్ వాడుతున్నారు.
ఇండియాకు కష్టమే
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై యూఎస్ అదనపు టారిఫ్లు వేస్తే ఇండియన్ కంపెనీలూ ఇబ్బంది పడతాయి. యూఎస్కు మన స్టీల్, అల్యూమినియం ఎగుమతులు తక్కువే అయినా, ట్రంప్ నిర్ణయంతో ఇతర సమస్యలు తలెత్తుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ల వలన యూఎస్కు జరిగే స్టీల్ ఎగుమతులు తగ్గుతాయని, ఫలితంగా మార్కెట్లో స్టీల్ సప్లయ్ పెరిగిపోతుందని పేర్కొన్నారు.
అదే జరిగితే స్టీల్ రేట్లు తగ్గిపోతాయి. స్టీల్ కంపెనీల ప్రాఫిట్స్ పడిపోతాయి. ఇప్పటికే స్టీల్ దిగుమతులు పెరగడంతో ఇండియన్ మెటల్ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. 2023 ఏప్రిల్–సెప్టెంబర్లో 36.6 లక్షల టన్నుల స్టీల్ దిగుమతి కాగా, కిందటేడాది ఇదే టైమ్లో ఈ నెంబర్ 55.1 లక్షల టన్నులకు పెరిగింది. మరోవైపు యూఎస్ను యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఫాలో అయ్యి అదనపు టారిఫ్లు వేస్తే ఇండియన్ కంపెనీలు భారీగా నష్టపోతాయి.
ఇండియా అల్యూమినియం, స్టీల్ ఎగుమతుల్లో యూఎస్కు జరిగే వాటా 5 శాతం కంటే తక్కువే ఉంది. ఈసారి స్టీల్ కంటే అల్యూమినియం ఎగుమతి చేసే కంపెనీలు ఇబ్బంది పడొచ్చు. ఈ ఇండస్ట్రీ తమ మొత్తం ఎగుమతుల్లో 12 శాతాన్ని యూఎస్కు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తోంది. ట్రంప్ మొదటిటెర్మ్ అయిన 2018 లో కూడా ఇలానే టారిఫ్లు వేశారని, అప్పుడు ఇండియా అల్యూమినియం ఎగుమతులపై పెద్దగా ప్రభావం పడలేదని ఎనలిస్టులు చెబుతున్నారు.
- అమెరికా ప్రొడక్ట్లపై సుంకాలు తగ్గించనున్న ఇండియా
- మోదీ యూఎస్ పర్యటనకు ముందే ప్రకటించే అవకాశం
డొనాల్డ్ ట్రంప్ రెసిప్రొకల్ ట్యాక్స్ వేస్తామని, మంగళవారం నుంచే అవి అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో మరికొన్ని యూఎస్ ప్రొడక్ట్లపై సుంకాలను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12, 13న ట్రంప్తో సమావేశం కానున్నారు. ఆయన అమెరికా పర్యటనకు ముందే సుంకాలను తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. తాజా బడ్జెట్లో కొన్ని యూఎస్ ప్రొడక్ట్లపై ఇప్పటికే కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. యూఎస్ ఇండియా ప్రొడక్ట్లపై సగటున 2.2 శాతం టారిఫ్ రేటు వేస్తుండగా, ఇండియా యూఎస్ ప్రొడక్ట్లపై సగటున 11 శాతం వేస్తోంది. ఈ నెంబర్ తాజా బడ్జెట్లోనే 13 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఈసారి మెడికల్ ఎక్విప్మెంట్లు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్పై సుంకాలు తగ్గించనున్నారు.
అతిపెద్ద భాగస్వామి
ఇండియాకు యూఎస్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో యూఎస్కు 77.5 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్లను ఇండియా ఎగుమతి చేసింది. మన మొత్తం ఎగుమతుల్లో 18 శాతం ఈ దేశానికే వెళుతున్నాయి. పెట్రోలియం ప్రొడక్ట్లు, ఫార్మా, మెడికల్ అప్లియెన్స్, టెక్స్టైల్, టెలికం పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, ప్రీషియస్ సోన్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఇండియా ఐరన్, స్టీల్, ఇతర మెటల్స్, కాయిన్స్ను కూడా ఎగుమతి చేస్తోంది. మనం చేసుకుంటున్న మొత్తం దిగుమతుల్లో యూఎస్ వాటా కేవలం 6 శాతంగానే ఉంది. క్రూడాయిల్ , మిలిటరీ ఎక్విప్మెంట్లు, విమాన విడిభాగాలు, ఎలక్ట్రికల్ మెషినరీని యూఎస్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.