America Cricket Team: చరిత్ర సృష్టించిన అమెరికన్లు.. 40 ఏళ్ల నాటి టీమిండియా రికార్డు బద్దలు

America Cricket Team: చరిత్ర సృష్టించిన అమెరికన్లు.. 40 ఏళ్ల నాటి టీమిండియా రికార్డు బద్దలు

అమెరికా క్రికెట్ టీమ్ మెల్లమెల్లగా  పసికూనలం అనే ట్యాగ్‌లైన్ తుడిచేస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో బలమైన పాకిస్తాన్‌ను ఓడించి ఔరా అనిపించిన అమెరికన్లు.. నేడు 40 ఏళ్ల నాటి టీమిండియా రికార్డు బద్దలు కొట్టే స్థాయికి ఎదిగారు. 

మంగళవారం(ఫిబ్రవరి 18) ఒమన్‌తో జరిగిన వన్డేలో అమెరికా 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థి జట్టును 65 పరుగులకే కట్టడి చేసింది. ఈ క్రమంలో  అమెరికన్లు.. 1985లో భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సేన నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టారు. 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ (2023-27)లో భాగంగా మంగళవారం అమెరికా, ఒమన్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 122 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. ఛేదనలో ఒమన్ 65 పరుగులకే కుప్పకూలింది. తద్వారా వన్డేల్లో 125 కంటే తక్కువ పరుగులను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా అవతరించింది. 

Also Read : బాబర్‌ను తొక్కేశాడు.. నెంబర్.1 వన్డే బ్యాటర్‌గా ‘గిల్’

గతంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒక జట్టు డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు రికార్డు టీమిండియా పేరిట ఉంది. 1985లో షార్జా వేదికగా జరిగిన ఓ వన్డేలో మెన్ ఇన్ బ్లూ.. పాకిస్థాన్‌పై 125 పరుగులను డిఫెండ్ చేసింది. తొలుత భారత బ్యాటర్లు 125 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ 87పరుగులకే పరిమితమయ్యింది. ఆనాటి నుంచి ఆ రికార్డుకు చేరువగా వచ్చిన జట్టే లేదు. అటువంటిది అమెరికన్లు చెరిపేశారు.

ఒక్క బంతి పేస్ పడలె.. 

ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా కెప్టెన్ ఒక్క ఓవరూ పేస్ బౌలింగ్ వేపించకపోవడం. ఒమన్లు 25.3 ఓవర్లు ఎదుర్కొంటే.. ఆ 25 ఓవర్లూ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టు పూర్తి ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా పేస్ బౌలింగ్ వేయకపోవడం ఇదే మొదటిసారి. 

అంతకుముందు ఒమన్ కెప్టెనూ అదే చేశాడు. స్పిన్ అస్త్రంతోనే అమెరికాను దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 20 వికెట్లలో 19 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఇదొక రికార్డు. 2011లో బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో 20 వికెట్లలో 19 వికెట్లు స్పిన్నర్లే తీయగా.. ఆ రికార్డును సమం చేశారు.