
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తుంగతుర్తి, వెలుగు : నియోజకవర్గ పరిధిలో బునాదిగాని కాల్వ పనులకు ఏప్రిల్ లో శంకుస్థాపన చేయనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం జలసౌధలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ఇందులో భాగంగా బునాదిగాని కాల్వ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు నియోజకవర్గం మీదుగా పోతున్న ఎస్ఆర్ఎస్సీ కాల్వకు లైనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు జంగల్ కటింగ్ కు నిర్ణయం తీసుకున్నామన్నారు. కేతిరెడ్డి కాల్వకు మరమ్మతులు చేపట్టి 15 గ్రామాలకు చెందిన చెరువులను నింపనున్నట్లు తెలిపారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎస్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.