సింగరేణిలో డైరెక్టర్​ పోస్టులు ఖాళీ

సింగరేణిలో డైరెక్టర్​ పోస్టులు ఖాళీ
  • ఇద్దరు డైరెక్టర్ల ఎక్స్​టెన్షన్​పై నో పర్మిషన్ 
  • గత నెలతో పూర్తయిన రెండేండ్ల పొడిగింపు
  • వీఆర్ఎస్​తీసుకునే ఆలోచనలో ఒకరు 
  • డైరెక్టర్ ​రేసులో దుర్గం రాంచందర్?

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​లో ఇద్దరు డైరెక్టర్ల ఎక్స్​టెన్షన్​పై ఉత్కంఠ నెలకొంది. మేనేజ్ మెంట్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో మూడు డైరెక్టర్ల పోస్టులు ఖాళీ అవుతాయి.  ఇప్పటికే ప్రాజెక్ట్​ ప్లానింగ్​డైరెక్టర్ సీటు ఖాళీగా ఉంది.  పాగా ఇన్ చార్జ్ డైరెక్టర్​జి. వెంకటేశ్వరరెడ్డి, ఆపరేషన్స్​డైరెక్టర్​ఎన్​వీకే శ్రీనివాస్​ బాధ్యతల్లో ఉండగా.. వీరి రెండేండ్ల కాలపరిమితి గత నెలతో ముగిసింది. 

ఎక్స్​ టెన్షన్​వస్తుందేమోనని శుక్రవా రం అర్ధరాత్రి దాకా ఎదురు చూసినా ఎలాంటి ఆర్డర్​రాలేదు. దీంతో పాగా ఇన్ చార్జ్ డైరెక్టర్​ జి. వెంకటేశ్వర రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఇదిలా ఉండగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి కీలకమైనవి. ఇలాంటి సమయంలో ఇద్దరు డైరెక్టర్లకు ఎక్స్​టెన్షన్​రాకపోవడంతో సీఎండీపై ఒత్తిడి పడే  చాన్స్ ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. 

వీఆర్ఎస్ తీసుకునేందుకు..

ఆపరేషన్స్​డైరెక్టర్​ఎన్​వీకే శ్రీనివాస్​కు గతంలోనే మేనేజ్ మెంట్ పాగా డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇంతకుముందే పలు కారణాలతో ఆయనను సింగరేణి అనధికారికంగా ఆదేశించడంతో లాంగ్​లీవ్​లో వెళ్లిపోయారు. మరో ఐదారు నెలల్లో వెంకటేశ్వరరెడ్డి రిటైర్​అవుతుండగా.. ఇప్పటివరకు జీఎంలపై డైరెక్టర్ గా పర్యవేక్షణ చేసిన ఆయనకు ఎక్స్​ టెన్షన్​రాకపోవడంతో జీఎంగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అటు వెళ్లడం ఇష్టంలేక వీఆర్ఎస్​పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరో వైపు లాంగ్​ లీవ్​లో ఉన్న డైరెక్టర్​శ్రీనివాస్​ ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. 

కాగా.. ఆయనకు సింగరేణి భవన్ లో మంచి హోదాతో పదవి వచ్చేలా మేనేజ్ మెంట్ చర్యలు చేపట్టిందనే ప్రచారం నడుస్తోంది. మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్​కు ఆపరేషన్స్​ డైరెక్టర్​కానీ,  పాగా డైరెక్టర్​నైనా బాధ్యతలు ఇచ్చే చాన్స్ ఉందని, ఇప్పటికే ఆర్డర్ రెడీ అయిందని హెడ్డాఫీస్​లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​అమలులోకి రావడంతో డైరెక్టర్ల ఎక్స్​టెన్షన్​, కొత్తగా రిక్రూట్ పై సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననేది చర్చనీయాంశమైంది.