
- టీ20ల్లో వంద కొట్టిన యంగెస్ట్ ప్లేయర్గా ఘనత
- ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. జీటీపై రాజస్తాన్ విక్టరీ
ఇండియా క్రికెట్కు కోహినూరు డైమండ్లాంటి క్రికెటర్ దొరికాడు. 14 ఏండ్లకే ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచి.. తొలి బాల్కే సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రాజస్తాన్ రాయల్స్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (38 బాల్స్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) తన మూడో మ్యాచ్లోనే విశ్వరూపం చూపెట్టాడు. వరల్డ్ క్లాస్ హిట్టర్ను తలపించేలా.. మేటి బౌలర్లంతా భయపడేలా.. డేరింగ్ బ్యాటింగ్తో, ఖతర్నాక్ షాట్లతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ను ఊచకోత కోశాడు.
పేసర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బాల్స్లోనే వంద అందుకొని టీ20 ఫార్మాట్లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుకెక్కాడు. ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్మురేపాడు. తన మొత్తం స్కోరులో ఫోర్లు, సిక్సర్లతోనే 94 రాబట్టిన ఈ బీహార్ బుడ్డోడు క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ కొత్త కోహినూరు విధ్వంసకర ఆటతో రాజస్తాన్ వరుసగా ఐదు ఓటముల తర్వాత తిరిగి గెలుపు బాట పట్టింది.
జైపూర్: కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీతో విజృంభించిన వేళ ఐపీఎల్–18లో రాజస్తాన్ రాయల్స్ మూడో విజయం అందుకుంది. అతనికి తోడు యశస్వి జైస్వాల్ (40 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్) రాణించడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది.
తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్ (50 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84), జోస్ బట్లర్ (26 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీలతో రాణించడంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 209/4 స్కోరు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో మహేశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఓపెనర్ల జోరుతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే 212/2 స్కోరు చేసి గెలిచింది. సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గిల్, బట్లర్ జోర్దార్
సూపర్ ఫామ్లో ఉన్న గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ (39) తొలి వికెట్కు 93 రన్స్ జోడించడంతో జీటీ భారీ స్కోరు చేసింది. రెండో ఓవర్లోనే తన క్యాచ్ను హెట్మయర్ డ్రాప్ చేయడంతో వచ్చిన చాన్స్ను సుదర్శన్ సద్వినియోగం చేసుకున్నాడు. యుధ్వీర్ వేసిన మూడో ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చాడు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని సాయి, గిల్ చక్కటి షాట్లతో క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టారు.
ఏడో ఓవర్లో బౌలింగ్కు దిగిన స్టాండిన్ కెప్టెన్ పరాగ్కు గిల్ సిక్స్తో స్వాగతం పలకగా.. యుధ్వీర్ బౌలింగ్లో సుదర్శన్ కూడా సిక్స్ కొట్టాడు. దాంతో సగం ఓవర్లకు జీటీ 92/0తో నిలిచింది. ఈ క్రమంలో గిల్ 29 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సుదర్శన్ కూడా ఫిఫ్టీ దిశగా సాగాడు. కానీ, తీక్షణ వేసిన 11వ ఓవర్లో భారీ షాట్కు ట్రై చేసి లాంగాన్లో పరాగ్కు క్యాచ్ ఇవ్వడంతో రాయల్స్కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది. అయినా జోరు కొనసాగించిన గిల్.. సందీప్ బౌలింగ్లో సిక్స్, యుధ్వీర్ ఓవర్లో రెండు సిక్సర్లతో మరింత స్పీడు పెంచాడు.
క్రీజులో కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న బట్లర్.. హసరంగ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. సెంచరీ చేసేలా కనిపించిన గిల్ను తీక్షణ ఔట్ చేసినా.. బట్లర్ వెనక్కు తగ్గలేదు. ఆర్చర్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. సుందర్ (13), తెవాటియా (9) చెరో సిక్స్ కొట్టి ఔటవగా జీటీ స్కోరు 200 దాటింది.
కుర్ర ఓపెనర్ల కేక
భారీ టార్గెట్ ఛేజింగ్లో రాజస్తాన్కు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. తన రెండో బాల్నే సిక్స్గా మలచిన వైభవ్ సూర్యవంశీ భీకర బ్యాటింగ్ను అడ్డుకోలేక గుజరాత్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇషాంత్ వేసిన రెండో ఓవర్లో జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ బట్లర్ వదిలేయడం జీటీని దెబ్బతీసింది. అదే ఓవర్లో సిక్స్తో టచ్లోకి వచ్చిన జైస్వాల్.. మూడో ఓవర్లో మూడు ఫోర్లు రాబట్టాడు. ఇషాంత్ వేసిన నాలుగు ఓవర్లో సూర్యవంశీ 6, 6, 4, 6, 4తో విజృంభించి ఏకంగా 28 రన్స్ రాబట్టాడు. ఐదో ఓవర్లో స్పిన్నర్ సుందర్ బౌలింగ్ వస్తే 6, 6, 4 బాది17 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు.
అతని జోరుతో పవర్ ప్లేలోనేఆర్ఆర్ 81/0 చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా వైభవ్ బాదుడులో ఏమాత్రం తేడా లేదు. పదో ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 6 తో ఏకంగా 30 రన్స్ పిండుకొని ఐపీఎల్లో తొలిసారి ఓవర్ బౌలింగ్ చేసిన అఫ్గాన్ బౌలర్ కరీమ్ జన్నత్కు పీడకలను మిగిల్చాడు. ఆపై రషీద్ ఖాన్ బౌలింగ్లో పుల్ షాట్తో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి సెంచరీ అందుకున్నాడు. దాంతో 11 ఓవర్లకే స్కోరు 150 దాటింది. ప్రసిధ్ బౌలింగ్లో 4, 6తో జైస్వాల్ కూడా గేరు మార్చగా.. సూర్యవంశీ బౌల్డ్ అవ్వడంతో తొలి వికెట్కు 166 రన్స్ పార్ట్నర్షిప్కు తెరపడింది.
అప్పటికే మ్యాచ్ ఆర్ఆర్ చేతుల్లోకి వచ్చేసింది. వన్డౌన్లో వచ్చిన నితీష్ రాణా (4) ఫెయిలైనా.. యశస్వికి తోడు కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్) కూడా దూకుడుగా ఆడటంతో టార్గెట్ కరిగిపోయింది. సుందర్ బౌలింగ్లో జైస్వాల్ ఫోర్, పరాగ్ సిక్స్ కొట్టడంతో మరో 25 బాల్స్ ఉండగానే రాయల్స్ మ్యాచ్ ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 209/4 (గిల్ 84, బట్లర్ 50 నాటౌట్, తీక్షణ 2/35)
రాజస్తాన్:15.5 ఓవర్లలో 212/2 (సూర్యవంశీ 101, జైస్వాల్ 70 నాటౌట్, రషీద్ ఖాన్ 1/24)