IPL 2025: వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆరు రోజుల పిల్లోడు.. ఇప్పుడు ధోనీతోనే ఐపీఎల్ ఆడుతున్నాడు!

IPL 2025: వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆరు రోజుల పిల్లోడు.. ఇప్పుడు ధోనీతోనే ఐపీఎల్ ఆడుతున్నాడు!

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టి ఆకర్షించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ లో జాక్ పాట్ కొట్టిన ఈ పదమూడేళ్ల చిచ్చర పిడుగు కోటీ పది లక్షలకు అమ్ముడుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. అతని గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు పెట్టారు. ఐపీఎల్ 2025 సీజన్ లో డెబ్యూ చేసేందుకు సిద్ధమయ్యాడు. 

13 ఏళ్ళ వయసులో  వైభవ్ సూర్యవంశీ 2011 లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కేవలం ఆరు రోజుల పిల్లోడు కావడం విశేషం. అప్పుడు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ వరల్డ్ కప్ గెలుచుకోవడంతో 28 ఏళ్ళ నిరీక్షణకు తెర పడింది. అప్పుడు ధోనీ వయసు 30 సంవత్సరాలు కాగా.. సూర్యవంశీ వయసు కేవలం 6 రోజులు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య వంశీ ధోనీతో ఐపీఎల్ ఆడుతుండడం విశేషం. ఈ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ధోనీ, వైభవ్ మధ్య 30 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ప్రస్తుతం ధోనీ వయసు 43 సంవత్సరాలు కాగా.. వైభవ్ వయసు 13 సంవత్సరాలు.   

Also Read :- చాహల్-ధనశ్రీ వర్మ విడాకులపై రేపు నిర్ణయం

మరో మూడు నెలల్లో జరగనున్న ఐపీఎల్ 2025 సీజన్ లో ధోనీ అతి పెద్ద వయస్కుడిగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడబోతున్నాడు. ఐపీఎల్‌ (2025) టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది.  మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక.

ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?

సూర్యవంశీ స్వస్థలం.. బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామం. ఇది సమస్తిపూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తండ్రి పేరు.. సంజీవ్ సూర్యవంశీ. 2011, మార్చి 27న జన్మించిన  ఈ బుడతడు.. నాలుగేళ్ళ వయస్సులో మొదటిసారి బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. అక్కడే అతనికి రోజంతా గడిచిపోయేది. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్‌కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి  అతన్ని సమస్తిపూర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల శిక్షణ అనంతరం పదేళ్ల ప్రాయానికి అండర్- 16 క్రికెట్‌లోకి ప్రవేశించాడు. 

పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమన్ ట్రోఫీ, అంతర్-జిల్లా టోర్నమెంట్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లలో దాదాపు 800 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను వినూ మన్కడ్ ట్రోఫీలోన్యూ కొనసాగించాడు. 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. ఇక్కడే అతని దిశ తిరిగింది. బీహార్ బోర్డు దృష్టిలో పడ్డాడు.